అక్షరటుడే, వెబ్డెస్క్: Uttar Pradesh | అన్నను కోల్పోయి.. పెళ్లి రద్దయిన ఓ యువతికి పోలీసులు(Police) అన్ని తామై వ్యవహరించారు. పెళ్లి రద్దు చేసుకున్న కుటుంబ సభ్యులతో చర్చించి దగ్గరుండి ఆమె వివాహం జరిపించారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లో చోటు చేసుకుంది.
ఉత్తర ప్రదేశ్లోని గొండాలో ఇటీవల దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఈ క్రమంలో ఓ వ్యక్తిని హత్య చేసి, ఇంట్లోని విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. అయితే చనిపోయిన వ్యక్తి సోదరికి పోలీసులు సంరక్షకులుగా వ్యవహరించారు. దోపిడీ జరగడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురై ఆమె వివాహం రద్దయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. అంతేగాకుండా దగ్గరుండి యువతి పెళ్లి జరిపించారు.
గోండా పోలీసు సూపరింటెండెంట్ వినీత్ జైస్వాల్(Vineet Jaiswal) మాట్లాడుతూ.. నెలన్నర క్రితం ఒక వ్యక్తి దోపిడీ దొంగల చేతిలో చనిపోయాడన్నారు. దోపిడీకి పాల్పడిన ఆరుగురు నిందితులలో నలుగురిని అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు వెల్లడించారు. మిగిలిన ఇద్దరు పోలీస్ ఎన్కౌంటర్(Police encounter)లో మృతి చెందారన్నారు. అయితే దోపిడీ తర్వాత ఆ ఇంట్లో వివాహం రద్దయిందని తమకు తెలిసిందన్నారు. కుటుంబం ఆర్థికంగా బాగా లేకపోవడంతో, పోలీసులు మరియు ఎస్టీఎఫ్(STF) కొంత సహాయం అందించాలని నిర్ణయించామని తెలిపారు. ఈ మేరకు ఆమె వివాహాన్ని జరిపించామన్నారు. కాగా పోలీసుల చర్యపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.