అక్షరటుడే, వెబ్డెస్క్: Rajasthan | వన్యప్రాణుల స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. వాటి అవయవాలను యథేచ్ఛగా విక్రయించేస్తున్నారు. తాజగా రాజస్థాన్లోని కోటాలో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న ఓ ముఠా ఆటలను అధికారులు కట్టడి చేశారు. ఢిల్లీ వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (WCCB), కోటాలోని అటవీ శాఖ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి ముఠా సభ్యులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి పెద్దఎత్తున వన్యప్రాణులు, వాటి అవయవాలు, పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
Rajasthan | ‘హాతాజోడి’ అంటే…
‘హాతా జోడి’ (Hatha Jodi)… హాతా అంటే వేరు, జోడీ అంటే జంట అని అర్థం. ఇది ఓ అరుదైన వృక్షం యొక్క వేరు భాగం. వేరులోని రెండు ప్రధాన భాగాలు ఒకదాన్నొకటి పెనవేసుకుని ఉన్నందున హాతా జోడీ అని పేర్కొంటారు. నదీ తీరం, కొండ ప్రాంతాలలో హాతా జోడి మొక్కలు అరుదుగా పెరుగుతాయంటారు.
అయితే, ఉడుము మర్మాంగాలు కూడా హాతాజోడిని పోలి ఉంటాయని పేర్కొంటారు. ఈ ‘హాతా జోడి’ని ఇంట్లో ఉంచుకుంటే సంపద పెరుగుతుందని, అద్భుత శక్తులు కలుగుతాయని, పాజిటివ్ ఎనర్జీ లభిస్తుందని నమ్ముతుంటారు. తాంత్రిక పూజల కోసం కూడా దీనిని ఉపయోగిస్తారనే ప్రచారం ఉంది.
ఇలాంటివి నమ్మేవారే రాజస్థాన్ కోటాలోని స్మగ్లర్లకు వరంగా మారారు. స్మగ్లర్లు ఒక్కో ‘హాతా జోడి’ని రూ.200 కు విక్రయించేవారు. కోటా బాలితా కున్హాడీ రోడ్డులోని ఓ మురికివాడలో ఈ హాతాజోడీ స్మగ్లర్ల కుటుంబాలు ఉండేవి.
Rajasthan | అండర్ కవర్ ఆపరేషన్..
అండర్ కవర్ ఆపరేషన్లో భాగంగా అటవీ శాఖ అధికారులు ఆ కాలనీకి ఓ మహిళా ఉద్యోగిని పంపించారు. సదరు మురికివాడలో ఉండే దీపక్ బవారీని ఆమె కలిసింది. రెండు హాతా జోడిలు కావాలని కోరింది. అతడు రూ. 400 తీసుకుని వాటిని ఇచ్చాడు.
అటవీశాఖ అధికారులు వాటిని పరిశీలించగా.. అవి ఉడుము మర్మాంగాలుగా తేలింది. వాటిని ఎండబెట్టి తయారు చేసినట్లుగా గుర్తించారు. దీంతో కోటా అటవీ శాఖ ఈ సమాచారాన్ని ఢిల్లీ వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (WCCB)కు చేరవేసింది. అనంతరం ఇరు డిపార్ట్మెంట్లు సంయుక్తంగా స్మగ్లర్లను పట్టుకున్నాయి.
Rajasthan | ఇలా వల పన్నారు..
ఈసారి మళ్లీ ఆమెనే స్మగ్లర్ల వద్దకు పంపారు. ఆమె దీపక్ వద్దకు వెళ్లి తనకు పెద్ద మొత్తంలో హాతా జోడీలు కావాలంది. ఇందుకు రూ.3 వేలు అడ్వాన్స్ కూడా చెల్లించింది. ఒప్పందంలో భాగంగా జైరాం బవారీ, దీపక్ బవారీ, ఓ అటవీ శాఖ వర్కర్ కలిసి నంథా గ్రామానికి 28 హాతాజోడీలు, నాలుగు జింక కొమ్ములు తీసుకొని వచ్చారు. అలా అభేదా బయోలాజికల్ పార్క్ వద్ద అటవీ శాఖ అధికారులకు నిందితులు పట్టుబడ్డారు.
నిందితులపై వన్యప్రాణుల పరిరక్షణ చట్టం-1972 కింద కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు కోటా డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (డీసీఎఫ్) అనురాగ్ భట్నాగర్ వెల్లడించారు.
Rajasthan | పురుషులంతా పరారీ..
నిందితుల అరెస్టు తర్వాత అధికారులు బాలితా కున్హాడీ మురికివాడపై రైడ్ చేశారు. కానీ, ఆ సమయానికే అనుమానితుల గుడిసెల్లో పిల్లలు, మహిళలు మాత్రమే ఉన్నారు. అరెస్టు భయంతోనే పురుషులు పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
నంథా గ్రామంలోని మరో మురికివాడలోనూ అధికారులు రైడ్ చేయగా.. 2 పక్షి గోళ్లు, 2 తాబేళ్లు, ఒక చిరుతపులి పంజా, ఆరు వలలు, కత్తులు, గొడ్డళ్లు ఇతరత్రా ఆయుధాలు వెలుగుచూశాయి. ఇక్కడ కూడా మహిళలు, పిల్లలే ఉండటం గమనార్హం.