అక్షరటుడే, నిజామాబాద్ : Nizamabad CP | ఒకప్పుడు ఏదైనా సమస్య వస్తే ప్రజలు పోలీస్ స్టేషన్ (Police station) మెట్లెక్కాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం పోలీసులే ప్రజల వద్దకు వెళ్తున్నారు. నిజామాబాద్ సీపీగా సాయిచైతన్య (Nizamabad CP Sai Chaitanya) బాధ్యతలు చేపట్టిన అనంతరం పోలీసులను ప్రజలతో మమేకం చేసేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నిజామాబాద్ కమిషనరేట్ (Nizamabad Commissionerate) పరిధిలో సరికొత్తగా ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించి ప్రజలతో మమేకమవుతున్నారు.
Nizamabad CP | ఫుట్ పెట్రోలింగ్
ఫుట్ పెట్రోలింగ్ (foot patrols)లో భాగంగా కాలనీల్లో స్థానికులతో కలియతిరుగుతున్నారు. ప్రజలకు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అంతేకాకుండా చోరీల నివారణకు జాగ్రత్తలపై ప్రజలకు వివరిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీలను (CCTV footage) పరిశీలించడంతో పాటు చెడిపోయిన వాటికి మరమ్మతులు చేయిస్తున్నారు. విధిగా కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే.. వివరాలు సేకరిస్తున్నారు.
Nizamabad CP | మత్తు పదార్థాలు, చోరీల నివారణకు చర్యలు
మత్తు పదార్థాలతో పాటు దొంగతనాల నివారణకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. కాలనీలతో పాటు శివారు ప్రాంతాల్లో గంజాయి, మద్యం తాగి న్యూసెన్స్ చేసేవారిని కట్టడి చేసేందుకు కాలనీల్లోకి కొత్తగా వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నారు. అంతేకాకుండా అనుమానితులు వస్తే వారి వివరాలను సేకరించడానికి నిఘా ఉంచారు. యువత చెడు అలవాట్లకు బానిసలు కావొద్దని అవగాహన కల్పిస్తున్నారు. వ్యసనాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకొవద్దని సూచిస్తున్నారు.
Nizamabad CP | అవగాహన కార్యక్రమాలు
జిల్లా వాప్తంగా పోలీసులు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ నివారణ అవగాహన (Drug prevention awareness) కార్యక్రమాలు చేపడుతున్నారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై వివరిస్తున్నారు. అంతేకాకుండా మహిళల చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులు (students), మహిళ భద్రతకు షీ టీంల పనితీరును వివరిస్తున్నారు. అలాగే సైబర్ మోసాలపై సైతం అవగాహన కల్పిస్తున్నారు.
Nizamabad CP | అనుమానితుల విచారణ
సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఆదేశాల మేరకు పోలీసులు జిల్లా వ్యాప్తంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 25 ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సరైన పత్రాలు లేని 700 లకు పైగా వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల సమయంలో అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించి వదిలేశారు. పోలీసులు చేపట్టిన ఈ చర్యలతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెనువెంటనే తమ సమస్యలు పరిష్కారం కావడం పట్ల పోలీసుల పనితీరును ప్రశంసిస్తున్నారు.