అక్షరటుడే, వెబ్డెస్క్ : Hydraa | ప్లాస్టిక్ వ్యర్థాలను (Plastic Waste) నియంత్రించకపోతే.. పర్యావరణానికి పెనుముప్పు తప్పదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. నాలాల ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలు చెరువుల్లోకి చేరి పర్యావరణానికి పెను సవాల్గా మారుతాయని చెబుతున్నారు. నాలాలు, చెరువుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు నియంత్రించడానికి ఎవరికి వారు ముందుకు రావాలని సూచిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని (Environment Day) పురస్కరించుకుని గురువారం హైడ్రా (Hydraa) కార్యాలయంలో `పొల్యూషన్ ఆఫ్ వాటర్ బాడీస్` అనే అంశంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Ranganath) ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో పలువురు పర్యావరణవేత్తలు మాట్లాడారు.
నాలాలు, మురికినీటి కాల్వల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు ఆఖరుకు వరదకు అడ్డుగా మారుతున్నాయని అన్నారు. హైడ్రా కమిషనర్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వర్థాలతో పర్యావరణానికి తీవ్ర ముప్పు పొంచి ఉందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఆయన సూచనలు తీసుకున్నారు. జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో రోజుకు 8 వేల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోందని.. సరైన నిర్వహణ లేక చెరువులు, నదులు, కుంటలు, వాగులు వ్యర్థాలతో పూడుకుపోతున్నాయని అన్నారు. నగరంలో ఉత్పత్తి అవుతున్న ఈ చెత్తను వేరు చేసి.. ఎరువుగా, ఇంధనంగా వినియోగించడంతో పాటు.. ప్లాస్టిక్ను మళ్లీ వినియోగించేలా చూడాలన్నారు.
Hydraa | ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోకుండా..
‘ప్లాస్టిక్ వ్యర్థాలు ఏ ప్రాంతం నుంచి ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతున్నాయి.. నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై దృష్టి పెట్టాల్సినవసరం ఉందని’ కమిషర్ అన్నారు. చెత్త రోడ్లపై వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రత్యామ్నాయంగా వినియోగించే వారికి రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలని సదస్సుకు హాజరైన వారు సూచించారు.