అక్షరటుడే, హైదరాబాద్: వానాకాలం పంటల సాగుకు వ్యవసాయ శాఖ సన్నద్ధం కావాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఆదేశించారు. అన్ని జిల్లాల్లో సాగు విస్తీర్ణానికి సరిపడే విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. నకిలీ విత్తనాలు, రైతులను మోసం చేసే కంపెనీలు, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు(Agriculture Minister Tummala Nageswara Rao, CM Advisor Vem Narender Reddy, Government Chief Secretary Ramakrishna Rao)తో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వానాకాలం పంటల సాగుపై సమీక్షించారు.
కల్తీ, నకిలీ విత్తనాల దందాను అరికట్టేందుకు అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాల వారీగా వ్యవసాయ శాఖ, పోలీస్ విభాగం సంయుక్తంగా టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించాలని, రాష్ట్ర సరిహద్దులు అన్ని చోట్ల టాస్క్ ఫోర్స్ నిఘా ఉంచాలని సూచించారు.
కల్తీ విత్తనాలు విక్రయించే, నిల్వలు, రవాణా చేస్తున్న వారెవరినీ ఉపేక్షించకుండా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. నకిలీ దందా చేసే వ్యాపారులపై పీడీ యాక్ట్(PD Act) కేసులు పెట్టాలన్నారు. విత్తనాలు, ఎరువులకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్ల(Collectors, SPs, Police Commissioners)తో మాట్లాడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని ముఖ్యమంత్రి ఆదేశించారు. కల్తీ విత్తనాల బారిన పడకుండా రైతుల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు చెప్పారు.
అన్ని జిల్లాల్లో సరిపడే విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని ముఖ్యమంత్రి కి అధికారులు వివరించారు. ఈ సీజన్లో వరి, పత్తి సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుందని, రైతుల నుంచి డిమాండ్ ఉన్న అన్ని కంపెనీల విత్తనాలు మార్కెట్లో ఉన్నాయని చెప్పారు.
ఎరువులు, విత్తనాల(fertilizers, seeds) గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి భరోసానిచ్చారు. ఈసారి రుతుపవనాలు(monsoon) ముందే వస్తుండటంతో, రాష్ట్రంలోనూ వానలు ముందుగానే కురిసే అవకాశముందని వాతావరణ శాఖ(Meteorological Department) చేసిన సూచనలను రైతులు గమనించాలన్నారు.