అక్షరటుడే, వెబ్డెస్క్: ACB Case | రాష్ట్రంలో ఏసీబీ (ACB) అధికారులు దూకుడు పెంచారు. అవినీతి అధికారుల పని పట్టడమే లక్ష్యంగా నిత్యం దాడులు చేస్తున్నారు. అయినా లంచాలకు మరిగిన అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తమ పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే ప్రజలను లంచాల (Bribe demand) కోసం వేధిస్తున్నారు. పైసలు తీసుకోనిదే పని చేయడం లేదు. తాజాగా లంచం డిమాండ్ చేసిన ఓ పంచాయతీ కార్యదర్శి (GP Secretery) ఏసీబీకి చిక్కాడు.
సూర్యాపేట (Suryapeta) జిల్లా పెన్పహాడ్ మండలం నాగులపాటి అన్నారం గ్రామంలో బొగ్గు ఉత్పత్తి చేయాలని ఓ వ్యక్తి అనుకున్నాడు. దీనికోసం అటవీ శాఖ అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అటవీ శాఖ అనుమతుల కోసం ఎన్వోసీ(నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) మంజూరు చేయాలని పంచాయతీ కార్యదర్శి అనంతుల సతీష్ కుమార్ను కలిశాడు. ఎన్వోసీ (NOC) ఇవ్వడానికి సదరు అధికారి బాధితుడి నుంచి రూ.15 వేల లంచం డిమాండ్ చేశాడు. ఆ వ్యక్తి బతిమిలాడటంతో రూ.8 వేలకు ఒప్పుకున్నాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు గురువారం జీపీ కార్యదర్శి సతీశ్కుమార్పై కేసు నమోదు చేశారు.
ACB Case | లంచం ఇస్తేనే పని
గ్రామాల్లో ప్రస్తుతం సర్పంచులు లేరు. ప్రత్యేకాధికారులను నియమించినా వారు గ్రామాలను పట్టించుకోవడం లేదు. దీంతో కొందరు పంచాయతీ కార్యదర్శులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలను లంచాల పేరిట పట్టి పీడిస్తున్నారు. ఏదైనా వ్యాపారం చేయడానికి అనుమతులు అడిగితే చేతులు తడిపితేనే పనులు చేస్తున్నారు. కొత్తగా ఇల్లు కట్టుకోవాలన్నా.. ఇంటి మ్యూటేషన్ చేయాలన్నా కార్యదర్శులు ప్రజల నుంచి వేలకు వేలు వసూలు చేస్తున్నారు. బర్త్, డెత్ సర్టిపికెట్ల కోసం కూడా డబ్బులు తీసుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ACB Case | లంచం అడిగితే ఫిర్యాదు చేయండి
ప్రజలు ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా తమకు ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number)కు ఫోన్ చేస్తే అవినీతి అధికారుల పని చెబుతామని పేర్కొంటున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు.