అక్షరటుడే, వెబ్డెస్క్: Home Minister Amit Shah | సింధు జలాల ఒప్పందం ఇక ఎప్పటికీ పునరుద్ధరించబడదని అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Home Minister Amit Shah) ప్రకటించారు. పాకిస్తాన్ ఒప్పంద ప్రధాన సూత్రాలను ఉల్లంఘించిందని, ఈ నేపథ్యంలోనే కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా(Times of India)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా కీలక విషయాలు వెల్లడించారు. అంతర్జాతీయ బాధ్యతల కారణంగా ఇండియా ఏకపక్షంగా ఒప్పందాన్ని రద్దు చేయలేకపోయినా, పాకిస్తాన్(Pakistan) పదేపదే రెచ్చగొట్టిన నేపథ్యంలో దానిని చట్టబద్ధంగా నిలిపివేసినట్లు చెప్పారు. ఒప్పందాన్ని ఎప్పటికీ పునరుద్ధరించబోమని తేల్చి చెప్పారు. “అంతర్జాతీయ ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయలేము, కానీ దానిని నిలిపివేయడానికి మాకు హక్కు ఉంది, మేము అదే చేశామని” షా అన్నారు. ఇండియా, పాక్ మధ్య శాంతి, పురుగతిని సాధించడానికి ఉద్దేశించిన 1960 ఒప్పందం ప్రవేశికను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. “ఒకసారి అది ఉల్లంఘిస్తే రక్షించడానికి ఏమీ మిగిలి ఉండదు” అని తెలిపారు.
Home Minister Amit Shah | సింధు జలాలు సద్వినియోగం చేసుకుంటాం..
ఇన్నాళ్లు పాకిస్తాన్ అక్రమంగా పొందుతున్న నీటిని ఇప్పుడు కోల్పోయిందని, ఇక ఆ దేశం గొంతెండాల్సిందేనని అమిత్ షా అన్నారు. సింధు జలాలను(Sindhu Water) భారత్ ఇప్పుడు మరింత సమర్థవంతంగా సద్వినియోగం చేసుకుంటుందని తెలిపారు. కాలువ నిర్మాణం ద్వారా రాజస్థాన్(Rajasthan) వైపు మళ్లిస్తున్నట్లు చెప్పారు. కశ్మీర్లో నెలకొన్న శాంతితో పాటు అక్కడ పెరుగుతున్న పర్యాటకాన్ని దెబ్బ తీసేందుకు, కశ్మీర్ యువత దృష్టి మళ్లించేందుకు ఉద్దేశపూర్వకంగానే పహల్గామ్ దాడి జరిగిందని హోం మంత్రి తెలిపారు. ఈ దాడి తర్వాత దేశం ఏకతాటిపైకి వచ్చిందన్నారు. కశ్మీర్ భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో ఇంత బలమైన సంఘీభావాన్ని గతంలో ఎప్పుడూ చూపించలేదన్నారు.
భవిష్యత్తులో జరిగే దురాక్రమణ చర్యలకు వేగంగా ప్రతీకారం తీర్చుకుంటామని పేర్కొన్నారు. “పాకిస్తాన్ ఏమి చేయాలని ఎంచుకున్నా, మేము ఆలస్యం చేయకుండా స్పందిస్తాము” అని ఆయన నొక్కి చెప్పారు. పౌర ప్రాంతాలను పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకున్న తర్వాతే.. భారత్ పాకిస్తాన్ వైమానిక స్థావరాలను దెబ్బతీసిందని చెప్పారు. దీంతో పొరుగు దేశం కాల్పుల విరమణకు ముందుకొచ్చిందన్నారు. పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) నిబద్ధతను షా ప్రశంసించారు. ఉగ్రవాద లాంచ్ ప్యాడ్(Terrorist launch pad)లపై పరిమిత దాడులు చేశామని, కానీ పాకిస్తాన్ తమపై దాడి చేసినట్లు భావించి తీవ్రంగా నష్టపోయిందన్నారు.
Home Minister Amit Shah | కాంగ్రెస్కు ఆ హక్కు లేదు..
ఇండియా చేపట్టిన సైనిక చర్యలపై కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శలను అమిత్ షా ఖండించారు. “నేను కాంగ్రెస్ను అడగాలనుకుంటున్నాను. వారు అధికారుంలో ఉన్నప్పుడు ఏం జరిగేది? వారు మంత్రిని మార్చడం తప్ప మరేమీ చేయలేదు. ఉగ్రవాదంపై మమ్మల్ని విమర్శించే హక్కు కాంగ్రెస్కు కచ్చితంగా లేదు” అని షా స్పష్టం చేశారు.