అక్షరటుడే, వెబ్డెస్క్: Israel – iran war | ఇరాన్పై అమెరికా బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేయడాన్ని పాకిస్తాన్ (Pakistan) తీవ్రంగా ఖండించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald trump)కు నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) ఇవ్వాలని ప్రతిపాదించిన తర్వాతి రోజే పాకిస్తాన్ నుంచి ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. అమెరికా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందని, ఇది పశ్చిమాసియా (Middle east)లో మరింత హింస పెరిగేందుకు దోహదం చేస్తుందని పాక్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్లోని మూడు కీలక అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా(America) దాడులు చేయడాన్ని ఖండించింది. ఐక్యరాజ్య సమతి చార్టర్ ప్రకారం ఇరాన్ తనను రక్షించుకునే హక్కు ఉందని తెలిపింది. “ఇజ్రాయెల్ దాడుల పరంపర తర్వాత ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులను పాకిస్తాన్ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని మేము తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం. ఈ దాడులు అంతర్జాతీయ చట్టంలోని అన్ని నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. UN చార్టర్ (UN Charter) ప్రకారం ఇరాన్ తనను తాను రక్షించుకునే చట్టబద్ధమైన హక్కును కలిగి ఉందని మేము పునరుద్ఘాటిస్తున్నాం” అని పాక్ ఎక్స్లో పోస్టు చేసింది.
Israel – iran war | ఇది దురాక్రమణే..
ఇరాన్పై జరుగుతున్న దాడిని పాకిస్తాన్ దురాక్రమణగా అభివర్ణించింది. ఇరాన్పై కొనసాగుతున్న దురాక్రమణ కారణంగా ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తుతుందని, ఇది ఇంకా కొనసాగితే ఈ ప్రాంతంతో సహా అంతటా తీవ్రంగా నష్టపరిచే ప్రభావాలు ఉంటాయని అది పేర్కొంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య శత్రుత్వాలను వెంటనే ముగించాలని పిలుపునిచ్చింది. సైనిక దాడులు ఆచరణీయమైన పరిష్కారం కాదని, ఈ ప్రాంతంలో దీర్ఘకాలిక స్థిరత్వాన్ని సాధించడానికి శాంతియుత చర్చలు సరైన మార్గమని తెలిపింది.