అక్షరటుడే, వెబ్డెస్క్: Padmavathi Express | ఈ మధ్య ట్రైన్ దొంగతనాలు(Train Robberies) చాలా జరుగుతున్నాయి. ఎంత సెక్యూరిటీ పెంచిన దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. 2014, 2016 సీజన్లలో పద్మావతి ఎక్స్ప్రెస్ (Padmavati Express)లో పలు రైలు దోపిడీ కేసులు నమోదయ్యాయి. గాఢ నిద్రలో ఉన్న మహిళల బంగారాన్నిదోచుకొని వెళ్లడమే వీరి టార్గెట్. తాజాగా సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న పద్మావతి ఎక్స్ప్రెస్లో శనివారం దోపిడీ దొంగలు చోరీకి పాల్పడ్డారు. నెల్లూరు జిల్లా కావలి-శ్రీవెంకటేశ్వర పాలెం మధ్య ప్రయాణిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తోంది.
Padmavathi Express | మరో దోపిడీ
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్(Secunderabad Railway Station) నుంచి పద్మావతి ఎక్స్ప్రెస్ తిరుపతికి బయలుదేరగా, మార్గమధ్యంలో, కావలి దాటి శ్రీవెంకటేశ్వర పాలెం సమీపంలో రైలు చేరుకుంది. ఆ సమయంలో గుర్తుతెలియని దుండగులు రైలులోని మూడు బోగీల్లోకి ప్రవేశించారు. నిద్రపోతున్న ముగ్గురు మహిళా ప్రయాణికుల మెడలోంచి సుమారు 40 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగలు లాక్కెళ్లినట్టు సమాచారం. అంతేకాకుండా వారి వద్ద ఉన్న రూ.20,000 నగదు, ఒక సెల్ఫోన్ను కూడా అపహరించారట. తెల్లవారుజామున జరిగిన ఈ హఠాత్ పరిణామంతో ప్రయాణికులు తవ్ర భయాందోళనకు గురయ్యారు.
అయితే దోపిడీ జరిగిన అనంతరం దొంగలు రైలు నుంచి దూకి పరారైనట్లు తెలుస్తోంది. బాధితులు వెంటనే రైల్వే పోలీసులకు(Railway Police) ఫిర్యాదు చేయడంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుల వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ముమ్మరం చేశారు. అలానే ప్రయాణికులకు పలు సూచనలు చేస్తున్నారు. రాత్రి ప్రయాణంలో మెడలో పెట్టుకున్న బంగారాన్ని దాచిపెట్టుకోండి. ఏ అనుమానాస్పద వ్యక్తి కనిపించిన వెంటనే సమాచారం అందించండి అని చెప్పుకొచ్చారు.