అక్షరటుడే, వెబ్డెస్క్: YS Jagan | కూటమి ప్రభుత్వంపై ఏడాదిలోనే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పల్నాడు జిల్లా రెంటపాళ్లలో బుధవారం తన పర్యటన విజయవంతమైందని జగన్ తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని జగన్ ఆరోపించారు. ప్రభుత్వంపై ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. తక్కువ కాలంలో ఇంత వ్యతిరేకత ఏ ప్రభుత్వానికీ రాలేదని పేర్కొన్నారు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కనిపించిందని ఆయన తెలిపారు.
YS Jagan | నియంతలా మారిన చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu) నియంతలా మారారని జగన్ ఆరోపించారు. ఆయన తీరులో అసంతృప్తి కనిపిస్తోందని విమర్శించారు. అణచివేతకు నిదర్శనంగా చంద్రబాబు తయారయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కార్యకర్తలను అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. పార్టీ కార్యకర్తలను పరామర్శించడం కూడా తప్పా అన్నారు.
YS Jagan | ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా..
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఇటీవల సాక్షి కార్యాలయాలపై(Sakshi Office) దాడులను ఆయన ఖండించారు. టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు దగ్గరుండి దాడులు చేశారని ఆరోపించారు.
YS Jagan | తప్పుడు కేసులు పెడుతున్నారు
కూటమి ప్రభుత్వంలో వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని జగన్ ఆరోపించారు. లిక్కర్ స్కామ్(Liquor scam)లో చెవిరెడ్డిని ఇరికించడానికి తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారన్నారు. చెవిరెడ్డి(Chevireddy) గన్మెన్ను బెదిరించి వాంగ్మూలం తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. చెవిరెడ్డి కుమారుడిని కూడా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పిన్నెల్లిపైనా తప్పుడు కేసులు పెట్టారని నందిగం సురేష్పైనా కేసుల మీద కేసులు పెడుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
YS Jagan | పొదిలి పర్యటనలో ఇబ్బంది పెట్టారు
ఇటీవల తన పొదిలి పర్యటనలో సైతం టీడీపీ నాయకులు(TDP Leaders) ఇబ్బందులు పెట్టారని వైఎస్ జగన్ అన్నారు. 40 వేల మంది వైసీపీ కార్యకర్తలు, రైతులపై 40 మంది టీడీపీ కార్యకర్తలు దాడి చేసి రెచ్చగొట్టారని ఆరోపించారు. అయినా రైతులు సంయమనం పాటించారని పేర్కొన్నారు. లేదంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవాలన్నారు. రైతులు సంయమనం పాటించినా వారిపైనే కేసులు పెట్టారని జగన్ పేర్కొన్నారు.