అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raid | రాష్ట్రంలో ఏసీబీ అధికారులు (ACB Officers) దూకుడు పెంచారు. గత కొంతకాలంగా నిత్యం దాడులు చేస్తూ అవినీతి అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. అయినా కొందరు అధికారులు మాత్రం మారడం లేదు. లంచాలకు మరిగిన అధికారులు భయపడటం లేదు. డబ్బులు ఇవ్వకపోతే ప్రజల పనులు చేయడం లేదు. అయితే ఏసీబీ దాడుల (ACB Raids)తో కొందరు నేరుగా డబ్బులు తీసుకోవడం లేదు. కిందిస్థాయి సిబ్బంది, ప్రైవేట్ వ్యక్తుల ద్వారా లంచాలు తీసుకుంటున్నారు. అయినా ఏసీబీ అధికారులు వారి ఆట కట్టిస్తున్నారు. తాజాగా లంచం తీసుకుంటుండగా.. ఓ కంప్యూటర్ ఆపరేటర్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ACB Raid | మ్యుటేషన్ కోసం..
వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమిని మ్యుటేషన్ (Mutation) చేసి, పత్రాలు అందించడానికి డేటా ఎంట్రీ ఆపరేటర్ లంచం డిమాండ్ చేశారు. సూర్యాపేట (Suryapeta) జిల్లా హుజూర్నగర్ మండలంలోని ఓ వ్యక్తి తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూమి మ్యుటేషన్ కోసం తహశీల్దార్ కార్యాలయంలో అధికారులను కలిశాడు. అయితే మ్యుటేషన్ చేసి ప్రోసిడింగ్ పత్రాలను అందించడానికి తహశీల్దార్ ఆఫీస్లోని ఆపరేటర్ కర్నాటి విజేత రెడ్డి రూ.12 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో శనివారం లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు ఆపరేటర్ (Tahsildar Office Operator) విజేత రెడ్డిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ACB Raid | అవినీతి కేంద్రాలుగా..
రాష్ట్రంలోని చాలా తహశీల్దార్ కార్యాయాలు (Tahsildar Offices) అవినీతి కేంద్రాలుగా మారాయి. ఆయా ఆఫీసుల్లో ఆపరేటర్ల నుంచి మొదలు పెడితే తహశీల్దార్ల వరకు లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. హుజుర్నగర్లో ఆపరేటర్ లంచం తీసుకుంటూ దొరికాడు. అయితే అంత మొత్తం లంచం డిమాండ్ చేశాడంటే.. ఆయన వెనుక అధికారులు ఉండే అవకాశం ఉంది. లేదంటే అంత ధైర్యంగా లంచం అడిగే అవకాశం లేదని పలువురు చర్చించుకుంటున్నారు.
తహశీల్దార్ ఆఫీసులతో పాటు, మున్సిపల్ కార్యాలయాల్లో సైతం అవినీతి రాజ్యమేలుతోంది. శనివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ ఆఫీసులోని రెవెన్యూ ఇన్స్పెక్టర్, బిల్ కలెక్టర్ను ఏసీబీ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. కొత్తగా నిర్మించిన ఇంటికి నంబర్ కేటాయించడానికి వీరు లంచం డిమాండ్ చేసి ఏసీబీకి చిక్కారు.
ACB Raid | భయపడొద్దు.. అండగా ఉంటాం
ప్రజలు ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా తమకు ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడుతామని పేర్కొంటున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.