అక్షరటుడే, వెబ్డెస్క్: Operation Karreguttalu | తెలంగాణ – ఛత్తీస్గఢ్ సరిహద్దులో ములుగు జిల్లా వెంకటాపూర్ సమీపంలో గల కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్(Encounter) చోటు చేసుకుంది. ఈ గుట్టల్లో భారీగా మావోయిస్టులు(Maoists) ఉన్నారనే సమాచారం మేరకు కేంద్ర బలగాలు కొన్నిరోజులుగా ఆపరేషన్ కర్రెగుట్టలు(Operation Karreguttalu) పేరుతో అడవులను జల్లెడ పడుతున్నాయి. ఇప్పటికే పలు గుట్టలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. బుధవారం గుట్టల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న ఛత్తీస్గఢ్ వైపు భద్రతా బలగాలు, మావోయిస్ట్లకు మధ్య ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Operation Karreguttalu | టార్గెట్ హిడ్మా
మావోయిస్ట్ కీలక నేత హిడ్మా(Hidma)తో పాటు దాదాపు వెయ్యి మంది మావోయిస్టులు కర్రెగుట్టల్లో ఆశ్రయం పొందుతున్నట్లు కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలో వేల మంది బలగాలతో ఏప్రిల్ 21 నుంచి ఆపరేషన్ కర్రెగుట్టలు చేపడుతోంది. అటవీ ప్రాంతంలో సవాళ్లను అధిగమిస్తూ బలగాలు కూంబింగ్(Combing) చేపడుతున్నాయి. ఇప్పటికే పలు గుట్టలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు ఆపరేషన్ కగార్, ఆపరేషన్ కర్రెగుట్టలు(Operation Karreguttalu) ఆపాలని ప్రజాసంఘాల నాయకులు కోరుతున్నాయి. మావోయిస్టులు చర్చలకు సిద్ధమని ప్రకటించినా.. కూంబింగ్ పేరిట ఎన్కౌంటర్లు చేయడం సరికాదని వారు అంటున్నారు.