అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | హైదరాబాద్ (Hyderabad) నగరంలో విషాదం చోటు చేసుకుంది. మటన్ (Mutton) తిని అస్వస్థతకు గురై ఒక్కరు మృతి చెందగా.. మరో ఏడుగురు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన నగరంలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్కుంటలో చోటు చేసుకుంది.
చింతల్కుంట ఆర్టీసీ కాలనీలో శ్రీనివాస్ యాదవ్ (46) కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆయన ఆర్టీసీ కండక్టర్గా పని చేస్తున్నారు. కాగా ఆదివారం బోనాల (Bonalu Festival) సందర్భంగా శ్రీనివాస్ మటన్, బోటీ, చికెన్ తీసుకొచ్చాడు. పండుగ రోజు తిన్న తర్వాత మిగిలిన కర్రీలను ఫ్రిజ్లో పెట్టారు. సోమవారం వాటిని వేడి చేసుకొని తిన్నారు. అయితే ఫుడ్ పాయిజన్ కావడంతో కుటుంబంలోని 8 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో వారు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. అయితే పరిస్థితి విషమించి శ్రీనివాస్ యాదవ్ మంగళవారం మృతి చెందారు. మిగతా ఏడుగురు చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.