అక్షరటుడే, వెబ్డెస్క్: Goa Government | గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్(Goa Chief Minister Pramod Sawant) కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఓలా(Ola), ఊబర్(Uber) వంటి క్యాబ్ అగ్రిగేటర్లకు అనుమతి ఇవ్వబోమని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా తీరప్రాంత ఎమ్మెల్యేలు, స్థానిక టాక్సీ ఆపరేటర్లు, హోటల్ యజమానుల ఒత్తిడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు మైఖేల్ లోబో, జిత్ అరోల్కర్ మాట్లాడుతూ.. గోవాలో టాక్సీ సేవలపై స్థానికులను భాగం చేయాలని కోరారు. స్థానిక టాక్సీ ఆపరేటర్లకు సమాన ఛార్జీల వ్యవస్థను ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు.
Goa Government | వాటికి నో ఎంట్రీ..
మాండ్రెం ఎమ్మెల్యే జిత్ అరోల్కర్(Mandrem MLA Jit Arolkar), కాలంగూట్ ఎమ్మెల్యే మైఖేల్ లోబో(Calangute MLA Michael Lobo)లతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడిన సావంత్.. “టాక్సీల అంశంపై జిత్, మైఖేల్ నన్ను కలిశారు. ప్రజల్లో వ్యతిరేకత రాకూడదు. ఇది కేవలం అగ్రిగేటర్ల కోసం రూపొందించిన మార్గదర్శకాలు. ఓలా(OLA), ఊబర్(Uber)లకు గోవాలోకి ఎంట్రీ ఉండదు. ఇప్పుడు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అందరి నమ్మకంతో ముందుకు సాగుతాం. టాక్సీ యజమానులు, హోటళ్ల యజమానులు, ఎమ్మెల్యేలు, అందరినీ చర్చల్లో భాగం చేసుకుని ముందుకెళ్తామని చెప్పుకొచ్చారు.
గత నెలలో గోవా ట్రాన్స్పోర్ట్ అగ్రిగేటర్ గైడ్లైన్స్ 2025 ముసాయిదాను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో యాప్ ఆధారిత టాక్సీలు, బైక్ టాక్సీల నిర్వహణకు సంబంధించిన లైసెన్స్ ఫీజులు(License fees), ఛార్జీలు(charges), ప్రోత్సాహకాలు మొదలైన అంశాలు ఉన్నట్లు పేర్కొంది. ఈ మార్గదర్శకాలపై రాష్ట్రవ్యాప్తంగా టాక్సీ యూనియన్లు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. యాప్ బేస్డ్ క్యాబ్ కంపెనీల ప్రవేశం వల్ల తమ జీవనోపాధి ముప్పులో పడుతుందన్న ఆందోళనతో పనాజీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్(Panaji Transport Department) ఆఫీసు ఎదుట వందలాది మంది టాక్సీ డ్రైవర్లు గత సోమవారం లిఖితపూర్వక అభ్యంతరాలను సమర్పించారు. ఎమ్మెల్యే జిత్ అరోల్కర్ మాట్లాడుతూ, “టాక్సీ డ్రైవర్లలో(taxi drivers) భయం ఉంది. ఓలా, ఊబర్ వస్తే వారి వ్యాపారాలు మూతపడతాయన్న అనుమానం ఉంది. ముఖ్యమంత్రితో కలిసి టాక్సీ యాజమాన్యాల ప్రతినిధులతో సమావేశమై ఈ అంశాలపై చర్చించాం. సీఎం హామీ ఇచ్చారు అని వెల్లడించారు. ప్రస్తుతం ఈ మార్గదర్శకాలపై ప్రజల నుంచి సూచనలు, అభ్యంతరాలను ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వం, తమ ముసాయిదాని ప్రకటించినప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేదు.