అక్షరటుడే, వెబ్డెస్క్: Hormuz : ఆయిల్ ధరలు (Oil prices) భగ్గుమన్నాయి. దాదాపు ఐదు నెలల గరిష్ట స్థాయికి చేరాయి. ఇరాన్పై అమెరికా దాడికి దిగడంతో పాటు హర్మూజ్ జలసంధి(Strait of Hormuz)ని మూసేస్తామని ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో చమురు ధరలకు రెక్కలొచ్చాయి. ప్రపంచ మార్కెట్లో దాదాపు 20 శాతం రవాణా జరిగే కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసి వేసేందుకు ఇరాన్ పార్లమెంట్ తీర్మానం చేసింది. ఈ నిర్ణయం ప్రపంచ చమురు అవసరాలపై పెను ప్రభావం చూపనుంది. దీంతో ఆయిల్ ధరలు భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ (Strait of Hormuz) బ్యారెల్ ధర 1.92 డాలర్లు(2.49%) పెరిగి 78.93 డాలర్లకు చేరింది. US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ధర 1.89 (2.56% ) డాలర్లు పెరిగి 75.73 డాలర్లకు చేరుకుంది. మార్కెట్ ఓపెనింగ్ సమయంలో చమురు ధరల్లో సుమారు 3 శాతం పెరుగుదల నమోదైంది.
Hormuz : చమురు సరఫరాలో ఇరాన్ కీలకం
అత్యధిక చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో ఇరాన్IRAN ది కీలక పాత్ర. ఆయిల్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే అతిపెద్ద మూడో దేశం ఇరాన్. ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలోకి అమెరికా ప్రత్యక్షంగా పాల్గొనడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇరాన్లోని కీలకమైన మూడు అణు స్థావరాలపై అమెరికా బీ-2 స్టెల్త్ జెట్ ఫైటర్లు భారీ బాంబులతో విరుచుకు పడ్డాయి. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రతీకార దాడులకు దిగితే ఊహించని రీతిలో దాడులు చేస్తామని హెచ్చరించారు. మరోవైపు, ఈ హెచ్చరికలను కొట్టిపడేసిన ఇరాన్.. తనను తాను రక్షించుకుంటానని, అమెరికాకు తగిన బుద్ధి చెబుతామని ప్రకటించడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.
Hormuz : హర్మూజ్ మూసివేతకు నిర్ణయం..
మరోవైపు ఇరాన్ పార్లమెంట్ Iranian parliament కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీకార చర్యల్లో భాగంగా హర్ముజ్ జలసంధిని మూసి వేయాలని నిర్ణయించింది. ప్రపంచ ముడి చమురు సరఫరాలో దాదాపు ఐదవ వంతు హర్మూజ్ జలసంధి ద్వారా రవాణా అవుతోంది. ఎంతో కీలకమైన ఈ జలసంధిని మూసివేసేందుకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదించిందని ఇరాన్ ప్రెస్ టీవీ వెల్లడించింది. ఇరాన్ గతంలో జలసంధిని మూసివేస్తామని బెదిరించినప్పటికీ, ఎప్పుడూ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఈ ప్రాంతం నుంచి ప్రత్యామ్నాయ పైప్లైన్ మార్గాలు ఉన్నప్పటికీ, హర్మూజ్ జలసంధి మూసివేస్తే మాత్రం ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం చూపుతుంది. కీలకమైన ఈ జలమార్గం ద్వారా చమురు రవాణాను ఒక నెల పాటు మూసివేస్తే బ్రెంట్ ధర బ్యారెల్కు 110 డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.