అక్షరటుడే, వెబ్డెస్క్:MLC Kavitha | కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Former CM KCR)కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులకు నిరసనగా.. బుధవారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జాగృతి(Jagruthi) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారని ఆమె ప్రశ్నించారు.
MLC Kavitha | తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లే..
కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం అంటే మొత్తం తెలంగాణ(Telangana)కు నోటీసులు ఇచ్చినట్లేనని కవిత వ్యాఖ్యానించారు. తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడం కేసీఆర్ చేసిన తప్పా అని ప్రశ్నించారు. తెలంగాణను అభివృద్ధిలో నంబర్వన్గా నిలబెట్టిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. అది కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) కాదని.. కాంగ్రెస్ కమిషన్, రాజకీయ కమిషన్ అని ఆమె విమర్శించారు.
MLC Kavitha | రాజకీయ దురుద్దేశంతోనే నోటీసులు
రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని కవిత అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మూడు బ్యారేజీలే కాదన్నారు. ఆ ప్రాజెక్టులో 21 పంప్ హౌజ్లు, 15 రిజర్వాయర్లు, 200 కి.మీ. మేర టన్నెల్ ఉందని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1500 కిలోమీటర్ల మేర కాలువలు ఉన్నాయన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎత్తిపోసిన మట్టితో దాదాపు 300 పిరమిడ్లు కట్టవచ్చని, వాడిన స్టీల్ తో 100 ఐఫిల్ టవర్లు కట్టవచ్చని ఆమె అన్నారు. అంత పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం అని కవిత పేర్కొన్నారు.
MLC Kavitha | హైదరాబాద్కు శాశ్వతంగా నీరు
కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయితే 35 శాతం తెలంగాణ భూభాగానికి నీళ్లు అందిస్తుందని కవిత పేర్కొన్నారు. 40 టీఎంసీలతో హైదరాబాద్(Hyderabad)కు శాశ్వతంగా నీరు ఇవ్వొచ్చారు. అలాగే మన పరిశ్రమలకు 16 టీఎంసీల నీళ్లు అందించవచ్చని ఆమె వివరించారు. 90 మీటర్ల అడుగున ఉండే నీళ్లను 600 మీటర్లపైకి ఎత్తిపోసే ప్రాజెక్టు కాళేశ్వరం అన్నారు. కేసీఆర్ది గట్టి గుండే కాబట్టి అంత పెద్ద ప్రాజెక్టును నిర్మించారని, కాంగ్రెస్ నాయకులకు కలలో కూడా అంతపెద్ద ప్రాజెక్టు కట్టాలన్న ఆలోచన రాదని ఎద్దేవా చేశారు.
MLC Kavitha | కేసీఆర్ను బద్నాం చేయడానికే..
రాష్ట్రంలోని దాదాపు 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించేందుకు కేసీఆర్ కాళేశ్వరం నిర్మించారని ఆమె అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) కుట్ర చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ను బద్నాం చేయడానికే కాళేశ్వరం కమిషన్ వేశారని విమర్శించారు. మేడిగడ్డకు చిన్న చిన్న మరమ్మతులు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పొలాలను ఎండబెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం మాత్రమే పనిచేస్తోందని ఆరోపించారు.
MLC Kavitha | ఏపీ ప్రాజెక్ట్లను అడ్డుకోవాలి
ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఎందుకు వ్యతిరేకించడం లేదని కవిత ప్రశ్నించారు. తెలంగాణ నీళ్లను ఏపీకి తరలించుకుపోతుంటే ఎందుకు కేంద్రానికి ఫిర్యాదు చేయడం లేదన్నారు. గోదావరి – పెన్నా అనుసంధానం పేరిట నీళ్ల తరలింపును తక్షణమే అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు(CM Chandrababu) జలదోపిడి చేసినా రాష్ట్ర బీజేపీ నాయకులు స్పందించడం లేదని విమర్శించారు. బీజేపీకి రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కేంద్రం నుంచి ఏమీ తేవడం లేదన్నారు. బకనచర్ల ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేసే బాధ్యతను ఈటల రాజేందర్(Etala Rajender) తీసుకోవాలని ఆమె కోరారు.