అక్షరటుడే, వెబ్డెస్క్: Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Former CM KCR), మాజీ మంత్రి కేటీఆర్(Former Minister KTR)కు నోటీసులు ఇవ్వాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కరీంనగర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యోగాసనాలు వేసిన అనంతరం ఆయన మాట్లాడారు. యోగా అంటే ఒక సాధనం, ఒక ఆయుధం అన్నారు. మనుషుల మధ్య వైరుధ్యాల నిర్మూలన యోగాతో సాధ్యమని పేర్కొన్నారు.
Phone Tapping Case | కేటీఆర్, ప్రభాకర్ మధ్య అమెరికాలో ఏం జరిగింది
యోగా దినోత్సవం అనంతరం బండి సంజయ్(Bandi Sanjay) ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించారు. బీఆర్ఎస్ హయాంలో బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్కు గురైనట్లు గుర్తించిన పోలీసులు ఆయన స్టేట్మెంట్ రికార్డు చేయడానికి సమయం అడిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభాకర్ రావు(Prabhakar Rao) అమెరికా నుంచి ఇండియాకు వచ్చే ముందు కేటీఆర్ అమెరికాకు ఎందుకు వెళ్లారని ఆయన ప్రశ్నించారు. వీరిద్దరి మధ్య అమెరికాలో ఏం జరిగిందని, కలిసి ఏం మాట్లాడుకున్నారన్నారు. కేటీఆర్ అమెరికాకు వెళ్లగానే.. ప్రభాకర్ రావు వచ్చి ఎందుకు సరెండర్ అయ్యాడని బండి సంజయ్ ప్రశ్నించారు.
Phone Tapping Case | చాలా మంది సంసారాలు నాశనం చేశారు
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఫోన్లు మాట్లాడుకోవాలంటే భయపడే పరిస్థితి ఉండేదని కేంద్రమంత్రి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం(Phone Tapping Case)పై అందరికంటే ముందు తానే మాట్లాడడని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్, సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు. పెద్దాయన చెబితేనే ఫోన్లు ట్యాప్ చేసినట్లు అధికారులు స్టేట్మెంట్ ఇచ్చారని బండి సంజయ్ అన్నారు. ప్రభాకర్ రావు చాలా మంది సంసారాలు నాశనం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ(Telangana)ను కేసీఆర్ కుటుంబం సర్వ నాశనం చేసిందని బండి సంజయ్ విమర్శించారు. కాళేశ్వరానికి లక్ష కోట్లు పెట్టి ఆదాయానికి దెబ్బ కొట్టారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐ(CBI)కి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.