అక్షరటుడే, వెబ్ డెస్క్: Khamenei | తమపై దాడి చేసి ఇజ్రాయెల్ (Israel Attack) తప్పు చేసిందని, అందుకు తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటుందని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ (Iran Supreme Leader Ayatollah Khamenei) పేర్కొన్నారు. ఇరాన్ ఎన్నటికీ తలొగ్గబోదని, యుద్ధానికి తమ సైన్యం సిద్ధంగా ఉందని హెచ్చరించారు. బుధవారం ఇరాన్ టెలివిజన్ లో ప్రసంగించిన అయతుల్లా ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ (United States – Israel) దేశాలపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) పిలుపునిచ్చిన కొన్ని గంటల తర్వాత ఖమేనీ తీవ్రంగా స్పందించారు.
లొంగిపోయే ప్రసక్తే లేదని ఆయన స్పష్టంచేశారు. తమ దేశంపై సైనిక చర్య తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సైనిక సంఘర్షణలో పాల్గొనకుండా అమెరికాను (America) హెచ్చరించారు. అలాంటి చర్య అమెరికా ప్రయోజనాలకు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుందని సూచించారు. ఇప్పటికే ఇజ్రాయెల్ (Israel) “తీవ్రమైన తప్పు” చేసిందని, టెల్ అవీవ్ తన దురాక్రమణకు “శిక్షించబడుతుందని” ప్రతిజ్ఞ చేశారు. “ఇజ్రాయెల్ చాలా పెద్ద తప్పు చేసింది, వారు తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారు. మేము వారిపై ఎటువంటి దయ చూపము” అని తెలిపారు.
Khamenei | తీవ్ర పరిణామాలు తప్పవు..
తమ భూభాగంపై జరిగే ఏదైనా దురాక్రమణపై ఇరాన్ (Iran) కఠినంగా స్పందిస్తుందని ఖమేనీ ప్రకటించారు. అందుకు తమ సాయుధ దళాలు (armed forces) అప్రమత్తంగా ఉన్నాయని చెప్పారు. జియోనిస్ట్ పాలన తమ గగనతలాన్ని ఆక్రమించడాన్ని, అమరవీరుల రక్తపాతాన్ని ఇరాన్ క్షమించదని, మరచిపోదని తెలిపారు. “మా సాయుధ దళాలు, అధికారులు మొత్తం దేశం మద్దతుతో మాతృభూమిని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాయి” అని ఖమేనీ అన్నారు.