అక్షరటుడే నిజాంసాగర్: Nizamsagar project | ఉమ్మడి నిజామాబాద్ జిల్లా (joint Nizamabad district) వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కింద రెండున్నర లక్షలకుపైగా ఎకరాలు సాగయ్యేవి. కానీ జలాశయంలో పూడిక పేరుకుపోతుండడంతో నీటినిల్వ సామర్థ్యం ఏడాదికేడాదికి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దీంతో ప్రాజెక్టు ఆయకట్టు 1.50 లక్షల ఎకరాలకు పడిపోయింది. పూడిక పేరుకుపోతుండడంతో అన్నదాతలు (farmers) ఆందోళన చెందుతున్నారు.
నిజాంసాగర్ ప్రాజెక్టును (Nizamsagar project) మంజీర నదిపై 1931 సంవత్సరంలో అచ్చంపేట గ్రామ శివారులో నిర్మించారు. 29.72 టీఎంసీల సామర్థ్యంతో అప్పటి నిజాం నవాబు మీరు ఉస్మాన్ అలీ ఖాన్ (Nizam Nawab Mir Usman Ali Khan) నేతృత్వంలో నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూర్ పర్యవేక్షణలో నిర్మాణం చేపట్టారు. 14 అడుగుల వెడల్పుతో ఆనకట్ట నిర్మించగా.. నిజాంసాగర్ నుంచి బాల్కొండ చివరి ఆయకట్టు వరకు 2.75 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించేలా ప్రధాన కాలువను 155 కిలోమీటర్ల మేర నిర్మించారు. 82 పంపిణీ కాల్వలు 283 ఉపకాల్వలు లతో ప్రాజెక్టును నిర్మించి ఆయకట్టుకు సాగునీరును (irrigation water) అందించేవారు.
Nizamsagar project | పేరుకుపోతున్న పూడిక
ప్రాజెక్టులో ఏళ్ల తరబడి పూడిక పేరుకుపోతున్నా.. తొలగించే దిశగా అడుగులు పడడం లేదు. రోజురోజుకు నీటి నిలువ సామర్థ్యం (water storage capacity) తగ్గిపోయి చివరి ఆయకట్టుకు నీరందని పరిస్థితి ఏర్పడింది. 2.75 లక్షలు ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు నిర్మించిన ప్రాజెక్టు ప్రధాన కాల్వలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో 465 కోట్ల రూపాయల వ్యయంతో 2009లో ప్రాజెక్టు ప్రధాన కాల్వలను ఆధునీకరించారు. కానీ పూడిక తొలగింపునకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
Nizamsagar project | 1975 ఇంజినీరింగ్ అధికారుల పరిశీలన
కర్ణాటక, మహారాష్ట్ర (Karnataka and Maharashtra) సరిహద్దు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు సాగర్ జలాశయంలోకి వరదలతో పాటు మట్టి ఇసుక కొట్టుకురావడంతో ప్రాజెక్టులో పూడిక విపరీతంగా చేరింది. దీంతో నీటి సామర్థ్యం గణనీయంగా పడిపోయింది. 1975 సంవత్సరంలో ఇంజనీరింగ్ అధికారులు (engineering officers) జరిపిన పరిశీలనలో నీటి నిల్వ సామర్థ్యం 11.89 టీఎంసీలకు చేరినట్లు నిర్ధారించారు. అంతేకాకుండా ఎఫ్ఆర్ఎల్ స్థాయిని 4.5 అడుగులకు పెంచడానికి అవకాశం ఉన్నట్లు గుర్తించారు. దీంతో 1978వ సంవత్సరంలో ప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్ స్థాయిని 1405 అడుగులకు పెంచడంతో నీటి నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలకు చేరింది.
Nizamsagar project | మంత్రి హామీతో ఆయకట్టు రైతుల్లో చిగురిస్తున్న ఆశలు
నిజాంసాగర్ ప్రాజెక్టు (Nizamsagar project) పూడిక తీయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. పూడిక తీయడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని.. దీంతో పంటలకు మేలు కలుగుతుందని అంటున్నారు. కాగా.. గత సీజన్లో ప్రాజెక్టు నీటిని విడుదల చేయడానికి వచ్చిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) నిజాంసాగర్, సింగూర్లో పూడిక తీస్తామని చెప్పారు. దీంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పూడిక తీసినట్లయితే మళ్లీ మంచి రోజులు వస్తాయని పేర్కొంటున్నారు.