అక్షరటుడే, వెబ్డెస్క్: CM Nitish Kumar | బీహార్ ఎన్నికలకు (Bihar elections) సమయం దగ్గర పడుతుండడంతో నితీశ్ ప్రభుత్వం ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తోంది. ఇప్పటికే సామాజిక పింఛన్లు రెట్టింపు సహా పలు కీలక నిర్ణయాలు తీసుకున్న జేడీయూ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు.. ఇప్పుడు యువతపై కన్నేసింది. వచ్చే ఐదేళ్లలో కోటి మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు సృష్టిస్తామని ప్రకటించింది.
ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Chief Minister Nitish Kumar) నేతృత్వంలో మంగళవారం సమావేశమైన కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అన్వేషించడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి కార్మిక శాఖ అభివృద్ధి కమిషనర్ (Labour Development Commissioner) నేతృత్వంలో 12 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాబోయే ఐదు సంవత్సరాలకు (2025 నుంచి 2030 వరకు) ఒక కోటి మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటించారు. అందుకు అనుగుణంగానే కేబినెట్ లో తీర్మానం చేశారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం అదనపు ప్రధాన కార్యదర్శి (క్యాబినెట్ సెక్రటేరియట్) ఎస్ సిద్ధార్థ విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఎన్నికలకు ముందు బీహార్ ప్రభుత్వం (Bihar government) కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే సామాజిక పెన్షన్లను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కోటి మందికి పైగా లబ్ధిదారులకు పెంచిన పెన్షన్ మొత్తాన్ని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ (Bihar Chief Minister Nitish Kumar) మొదటి విడతగా పంపిణీ చేశారు. తాజాగా మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో వివిధ శాఖల నుంచి 30 ప్రతిపాదనలను కూడా మంత్రివర్గం ఆమోదించింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు (assembly elections) ముందు ఈ నిర్ణయం ప్రాముఖ్యతను సంతరించుకుంది.