అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగు పెట్టిన ఆమె జీవితం అర్ధంతరంగా ముగిసింది. భర్తతో కలిసి నూరేళ్లు ఆనందంగా గడుపుదామని ఆ యువతి కన్న కలలు కల్లలు అయ్యాయి. భర్త వేధింపులు తాళలేక పెళ్లయిన రెండు నెలలకే తనువు చాలించింది. ఈ ఘటన హైదరాబాద్లోని కూకట్పల్లి హౌసింగ్బోర్డు(Kukatpally Housing Board)లో చోటు చేసుకుంది.
ఖమ్మం జిల్లా(Khammam District) కొణిజర్ల మండలం సాలె బంజర గ్రామానికి చెందిన పూజిత(19)కు అదే గ్రామానికి చెందిన జాటోతు శ్రీనివాస్తో ఏప్రిల్ 16న పెళ్లి అయింది. శ్రీనివాస్ కేపీహెచ్బీలో నివాసముంటూ ఓ జ్యువెలరీ షోరూంలో సేల్స్మెన్(Salesman) గా పని చేస్తున్నాడు. అయితే ఇటీవల గ్రామంలో పూజిత తమ బంధువులతో కలిసి కూల్డ్రింక్ తాగింది. అయితే వారికి శ్రీనివాస్ కుటుంబానికి పడదు.
ఆమె కూల్డ్రింక్ తాగడాన్ని వీడియో తీసి శ్రీనివాస్ అన్న, అల్లుడు వాట్సాప్లో పంపారు. అప్పటి నుంచి తమకు పడని వాళ్లతో కూల్డ్రింక్ ఎందుకు తాగవని శ్రీనివాస్ పూజితను వేధిస్తున్నాడు. దీంతో పాటు అదనపు కట్నం కోసం కూడా వేధించినట్లు పూజిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలో వేధింపులు తాళలేక పూజిత ఆత్మహత్య చేసుకుంది. ఆమె కుటుంబం ఫిర్యాదుతో భర్త శ్రీనివాస్తో పాటు అత్తింటివారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.