అక్షరటుడే, అమరావతి: AP New Airport: ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లిగూడెం(Tadepalligudem)లో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం(central government) ఆమోదం తెలిపింది. ఈ మేరకు భూసేకరణకు కేంద్రం రూ.1,570.64 కోట్లు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు పశ్చిమ గోదావరి జిల్లాకు విమాన సేవలను దరి చేరుస్తుంది. ఇది ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరిచి, వ్యాపారం, పరిశ్రమలకు ఊతమిస్తుందని అధికారులు పేర్కొన్నారు.
విమానాశ్రయం ‘ఉడాన్’ పథకం(‘UDAN’ scheme) కింద చిన్న విమాన సేవలతో ప్రారంభం కానుంది. ప్రాథమిక సర్వేలు, భూసేకరణ ఇప్పటికే మొదలయ్యాయి.
తాడేపల్లిగూడెం ప్రాంతం వ్యవసాయం, ఆక్వాకల్చర్, చిన్నతరహా పరిశ్రమలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కొత్త విమానాశ్రయం ఏర్పాటుతో.. ఉత్పత్తుల రవాణా, రొయ్యలు , ఇతర వస్తువుల ఎగుమతికి గణనీయమైన ఊతం లభిస్తుంది. ఇది రైతులు, వ్యాపారులకు మెరుగైన మార్కెట్ అవకాశాలను సృష్టించడంతో పాటు.. కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తుంది. దీనికితోడు పశ్చిమ గోదావరి(West Godavari) జిల్లాలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి దోహదపడుతుంది.