అక్షరటుడే, కామారెడ్డి : Constable suspended | విధుల్లో నిర్లక్ష్యం వహించిన నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ (Nizam sagar PS) కానిస్టేబుల్ మోహన్ సింగ్ సస్పెండ్ అయ్యాడు.
విధుల్లో అలసత్వం వహించినందుకు గాను సదరు కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు వేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు కానిస్టేబుల్ విధుల్లో నిర్లక్ష్యం వహించడమే కాకుండా అనైతికంగా ప్రవర్తించాడని ఎస్పీ పేర్కొన్నారు. పోలీసు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నాడని తన దృష్టికి వచ్చిందన్నారు. దీంతో సస్పెండ్ చేసినట్లు తెలిపారు. పోలీస్ సిబ్బంది ఎవరైనా అనైతిక చర్యలకు పాల్పడితే శాఖ పరమైన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.
కాగా.. మోహన్ సింగ్.. మొదటి నుంచి పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. డబ్బులు వసూలు చేయడమే కాకుండా పేకాట అందిస్తున్నట్లు సమాచారం. పక్కా ఆధారాలు లభించడంతో సత్వరమే చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా.. కామారెడ్డి జిల్లా పోలీసు శాఖలో ఎస్పీ రాజేష్ చంద్ర తనదైన మార్క్ చూపిస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు పలువురు ఎస్సైలు, సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే.. పలువురికి చార్జి మెమోలు కూడా జారీ చేశారు. ఆయన చర్యలతో జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బందిలో మార్పు కనిపిస్తోంది.