అక్షరటుడే, వెబ్డెస్క్:MP Shashi Tharoor | పాకిస్తాన్తో యుద్ధ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అమెరికాకు సరెండర్ అయ్యారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ (Rahul Gandhi) చేసిన ఆరోపణలను ఆయన పార్టీకే చెందిన ఎంపీ, మాజీ మంత్రి శశిథరూర్ కొట్టి పడేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఎప్పుడూ మూడో పక్షం జోక్యం లేదని స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష ఎంపీలతో ప్రతినిధుల బృందాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అమెరికాలో పర్యటిస్తున్న ఎంపీల బృందానికి నాయకత్వం వహిస్తున్న ఎంపీ శశిథరూర్ నేషనల్ ప్రెస్ క్లబ్లో విలేకర్లతో మాట్లాడారు. భారత్, పాకిస్తాన్(Pakistan) మధ్య యుద్ధాన్ని నిలువరించేందుకు తాను దౌత్యం వహించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పలుమార్లు ప్రకటించడం, మరోవైపు, నరేందర్ (మోదీ) సరెండర్ అయ్యారని రాహుల్గాంధీ ఆరోపణలు చేయడంపై విలేకరులు ప్రశ్నించగా, థరూర్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. “యుద్ధం ఆపడానికి ఎవరి హితబోధ భారత్(Bharath)కు అవసరం లేదని” చెప్పారు. పాకిస్తాన్ ఆపితే మేము ఆపేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ విషయాన్ని దాయాదికి కూడా చెప్పామన్నారు. దీంతో పాకిస్తాన్ వెనక్కు తగ్గిందని స్పష్టం చేశారు.
MP Shashi Tharoor | చర్చల ప్రసక్తే లేదు..
మా తలలపై తుపాకులు గురి పెట్టిన వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నంత కాలం పాకిస్థాన్తో చర్చలు జరపబోమని థరూర్ (MP Shashi Tharoor) స్పష్టం చేశారు. పాక్ ఎగదోస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని అమెరికా(America)తో సహా పలు దేశాలకు వివరించామన్నారు. భారత్ పరిస్థితి ఏమిటన్నది అమెరికాకు క్లియర్గా అర్థమైందన్నారు. భారత్ చర్చలకు సిద్ధంగా ఉందని.. కానీ బలవంతంగా కాదని స్పష్టం చేశారు. పాకిస్థాన్ నుంచి ఉగ్రవాద చర్యలు కట్టడి చేసిన తర్వాతే.. ఏమైనా జరుగుతోందని తెలిపారు.
MP Shashi Tharoor | మధ్యవర్తిత్వం ప్రసక్తే లేదు..
వాణిజ్యాన్ని ఆయుధంగా చేసుకుని భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణకు ఒత్తిడి తెచ్చానని ట్రంప్ చేసిన వాదనను థరూర్ కొట్టిపడేశారు. భారత్, పాకిస్థాన్ల మధ్య చర్చల కోసం అమెరికా ప్రమేయాన్ని కోరతారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఎంపీ శశిథరూర్ బదులిస్తూ.. తమ పర్యటన కేవలం ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్ వ్యవహార శైలిపై అవగాహన కల్పించడం కోసమేనని పేర్కొన్నారు. అంతేకాని.. భారత్, పాకిస్థాన్ల మధ్య అమెరికా మధ్యవర్తిత్వం కోసం కాదన్నారు. ఒక వేళ ఏదైనా మధ్యవర్తిత్వం కావాలనుకుంటే ఆ వ్యవహారాన్ని ప్రభుత్వం చూసుకుటుందని పేర్కొన్నారు.
కానీ తమ పరిస్థితిని తెలియజేయడంతోపాటు ఉగ్రవాదం(Terrorism)పై ఏ మాత్రం అపోహలకు తావు ఇవ్వకూడదనే ప్రధాన ఉద్దేశ్యంతోనే అమెరికాలో తమ బృందం పర్యటిస్తుందని చెప్పారు. ఇక భారత్ కోసం ఏమైనా చేయాలంటూ ఏ దేశాన్నీ తాము కోరలేదన్నారు. కేవలం పాకిస్థాన్ చేస్తున్న ఉగ్రదాడుల వ్యవహారంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా తమ బృందం పర్యటన సాగుతోందని స్పష్టం చేశారు.