అక్షరటుడే, వెబ్డెస్క్ : MP Shashi Tharoor | కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశిథరూర్(MP Shashi Tharoor) ఇప్పుడు దేశ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారారు. ఆయన కేంద్రంగానే అధికార, ప్రతిపక్ష పార్టీ ఆరోపణలు, ప్రత్యారోపణలతో సెగ పుట్టిస్తున్నాయి. పాకిస్తాన్(Pakistan) ఎగదోస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రపంచ వేదికలపై వెల్లడించేందుకు కేంద్ర ప్రభుత్వం(Central government) అఖిలపక్ష బృందాలను వివిధ దేశాలకు పంపాలని నిర్ణయించింది. ఇందులో ఒకదానికి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నాయకత్వం వహించడం గ్రాండ్ ఓల్డ్ పార్టీలో కొంత కలకలం రేపింది. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) తర్వాత ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని కీలక భాగస్వామ్య దేశాలకు చెప్పేందుకు వెళ్లే ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేయడం, అందులో ఒకదానికి థరూర్కు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పేర్లను కాదని థరూర్కు బాధ్యతలు అప్పగించడం ద్వారా ఆ పార్టీని బీజేపీ(BJP) కార్నర్ చేసినట్లయింది.
MP Shashi Tharoor | నిజాయితీ లేదన్న కాంగ్రెస్..
థరూర్(Tharoor) ఎంపికపై కాంగ్రెస్ విభిన్నంగా స్పందించింది. విదేశాలకు వెళ్లే ప్రతినిధుల కోసం నలుగురు ఎంపీల పేర్లలో శశి థరూర్ లేకపోయినప్పటికీ, ఆయనకు అవకాశం కల్పించడంపై ఇది “ప్రభుత్వం వైపు నుంచి నిజాయితీ లేనిది” అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్(Jairam Ramesh) శనివారం విమర్శించారు. “మమ్మల్ని పేర్లు అడిగారు. మేము ఇచ్చిన పేర్లు చేరుస్తారని ఆశించాము. కానీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(Press Information Bureau) ఇచ్చిన పత్రికా ప్రకటన చూసి ఆశ్చర్యపోయాము. ఇప్పుడు ఏమి జరుగుతుందో నేను చెప్పలేను. నాలుగు పేర్లు అడగడం, నాలుగు పేర్లు ఇవ్వడం, మరొక పేరును ప్రకటించడాన్ని చూస్తుంటే ప్రభుత్వం వైపు నుండి నిజాయితీ లేదని అర్థమవుతూనే ఉంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా రిజిజు.. రాహుల్ జీ, ఖర్గేతో మాట్లాడి ఉండవచ్చు, కానీ ఏమి జరిగిందో నిజాయితీ లోపించింది. మేము ఇచ్చిన నాలుగు పేర్లను మార్చబోవడం లేదు” అని జైరామ్ రమేష్ తెలిపారు.
MP Shashi Tharoor | బీజేపీ ఎదురుదాడి..
మరోవైపు, కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. చాలా మంది భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు శశి థరూర్కు మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ “అభద్రత”, “అసూయ”తో ఉందని విమర్శించారు. “శశి థరూర్ వాగ్ధాటిని, ఐక్యరాజ్యసమితి అధికారిగా ఆయన సుదీర్ఘ అనుభవాన్ని, విదేశాంగ విధాన విషయాలపై ఆయన లోతైన అంతర్దృష్టిని ఎవరూ కాదనలేరు” అని బీజేపీ నేత అమిత్ మాల్వియా ‘X’లో ఒక పోస్ట్లో పేర్కొన్నారు. “అందుకే కాంగ్రెస్ పార్టీ – ముఖ్యంగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీలక అంశాలపై భారత వైఖరిని వివరించడానికి విదేశాలకు పంపబడుతున్న బహుళ పార్టీ ప్రతినిధుల బృందాలకు ఆయనను నామినేట్ చేయకూడదని ఎందుకు ఎంచుకుంది? అది అభద్రతా? అసూయ? లేదా ‘హైకమాండ్’ను మించిన ఎవరికైనా అసహనమా?” అని ప్రశ్నించారు.
మరోవైపు, పాకిస్తాన్ జిందాబాద్ అని ఎన్నికల నినాదాలు చేసిన వ్యక్తులతో సహా సందేహాస్పద వ్యక్తుల పేర్లను ప్రతిపాదించడంపై బీజేపీ నేత నాయకుడు షెహజాద్ పూనావాలా(Shehzad Poonawalla) మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పేర్లలో శశి థరూర్ పేరును ప్రతిపాదించకపోవడంపై విమర్శించారు. కాంగ్రెస్ తన నాయకులను విశ్వసించడం లేదన్నారు. “కాంగ్రెస్ తన పార్టీ నాయకులను నమ్మదు. శశి థరూర్ నిరంతరం పాకిస్తాన్ కుట్రలను అడ్డుకున్నాడు. భారతదేశం మొదట అనే భావనను చాటాడు. కానీ కాంగ్రెస్ దేశం కంటే తన పార్టీకి ప్రాధాన్యత ఇచ్చింది. పాకిస్తాన్ జిందాబాద్ అనే ఎన్నికల నినాదాలు చేసిన వ్యక్తులతో సహా సందేహాస్పద పేర్లను ముందుకు తెచ్చింది” అని పూనావాలా చెప్పినట్లు ANI పేర్కొంది.