అక్షరటుడే, వెబ్డెస్క్: lawcet 2025 | ఎమ్మెల్యే(MLA)గా గెలిచిన వారికి తీరిక ఉండదు. నిత్యం ప్రజలు, కార్యకర్తలతో సమావేశాలు.. పర్యటనలతో బిజీగా ఉంటారు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు న్యాయం చేస్తూ చదవడం అంత ఈజీ కాదు. అలాంటిది ఓ ఎమ్మెల్యే లాయర్ కావడం కోసం లాసెట్(lawcet)లో ఏకంగా 739వ ర్యాంక్ సాధించడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్లోని నందిగామ ఎమ్మెల్యే (Nandigama MLA) తంగిరాల సౌమ్య (Tangirala Sowmya) ఏపీ లాసెట్లో 739వ ర్యాంక్ సాధించి ప్రతిభ కనబరిచారు. ఎమ్మెల్యేగా పనిచేస్తూ లాయర్ అవ్వాలనే లక్ష్యంతో 43 ఏళ్ల వయసులో లాసెట్లో ఆమె ర్యాంక్ సాధించడం గమనార్హం.
తంగిరాల సౌమ్య తన తండ్రి ప్రభాకర్రావు ఆకస్మిక మరణంతో రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన అదే ఏడాది మరణించారు. దీంతో ఉప ఎన్నికల్లో టీడీపీ (TDP) నుంచి పోటీ చేసిన సౌమ్య ఎమ్మెల్యేగా గెలిచారు. నందిగామ తొలి మహిళా ఎమ్మెల్యేగా రికార్డు సాధించారు. అనంతరం 2019 ఎన్నికల్లో ఓడిపోయిన ఆమె.. 2024 జరిగిన ఎన్నికల్లో మళ్లీ టీడీపీ నుంచి విజయం సాధించారు.