అక్షరటుడే, కామారెడ్డి: Minister Seethakka | అధికారులు మనసు పెట్టి పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ (State Panchayat Raj Department) మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) (Minister Sitakka) అన్నారు. జిల్లా కేంద్రానికి మంగళవారం వచ్చిన మంత్రి ముందుగా మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో (Minority residential school) వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.
Minister Seethakka | జిల్లాకు మంచిపేరు తేవాలి..
కలెక్టర్ కార్యాలయానికి (Collector Office) వచ్చిన మంత్రి అనసూయ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు చిత్తశుద్ధితో, మానవతా దృక్పథంతో పని చేయాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అధికారులదే కీలకపాత్ర అని పేర్కొన్నారు. బాగా పనిచేసి జిల్లాకు మంచిపేరు తేవాలని సూచించారు.
Minister Seethakka | ఫీల్డ్ విజిట్ చేయాలి
వారానికి ఒకటి, రెండు సార్లు ఉన్నతాధికారులతో సహా అధికారులు ఫీల్డ్ విజిట్ (Field visit) చేయాలని మంత్రి సూచించారు. అలా జరిగితేనే క్షేత్రస్థాయిలో సమస్యలు అధికారులకు తెలుస్తాయన్నారు. సమస్య ఎక్కడుంటే అక్కడే పరిష్కార మార్గం కూడా ఉంటుందని, సమస్య జఠిలం అయ్యేదాక చూసుకోవద్దని అధికారులకు హితవు పలికారు. సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారుల తల్లిదండ్రులు, అధికారుల పిల్లలు తలెత్తుకునేలా పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan), అదనపు కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.