అక్షరటుడే, కామారెడ్డి: Micro Finance | పల్లెల్లో మళ్లీ మైక్రో ఫైనాన్స్ పడగ విప్పుతోంది. మహిళలు, చిరువ్యాపారులకు రుణాలు (Loans) ఇస్తూ వారిని నిండా ముంచుతున్నారు వడ్డీ వ్యాపారులు. అత్వసరాన్ని ఆసరాగా చేసుకుని అధిక వడ్డీకి రుణాలు ఇచ్చి.. తీరా ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోతే వేధింపులకు గురి చేస్తున్నారు. గతంలో మైక్రో ఫైనాన్స్ల వేధింపులు తాళలేక ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలున్నాయి. అప్పట్లో ప్రభుత్వం వీటిని నిషేదించింది. మళ్లీ గ్రామాల్లో మైక్రో ఫైనాన్స్లు తమ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి.
మైక్రో ఫైనాన్స్ (Micro Finance) నిర్వాహకులు ముందుగా తమ ఏజెంట్లను (Agents) గ్రామాల్లోకి పంపి, పేద మహిళలు, సంఘాల సభ్యులను కలుస్తున్నారు. వారం, 15రోజుల వాయిదా చెల్లింపులతో రుణాల ఆశ చూపుతున్నారు. పది నుంచి 12 మంది మహిళలను గ్రూపుగా ఏర్పాటు చేసి, 15 రోజుల్లోనే రుణం అందిస్తున్నారు. ఒక్కో గ్రామంలో 20 నుంచి 30 గ్రూపులు ఏర్పడి రుణాలు పొందినట్లు తెలుస్తోంది.
కామారెడ్డి నియోజకవర్గంలోని రామారెడ్డి, సదాశివనగర్, భిక్కనూర్, దోమకొండ మండలాల్లో ఈ తరహా రుణాలు ఎక్కువగా ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈజీగా రుణం వస్తుండడంతో మహిళలు వీటికి ఆకర్షితులవుతున్నారు. తీరా ఆర్థిక ఇబ్బందులతో ఈఎంఐ చెల్లించకపోతే వేధింపులకు గురి చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోనూ పలు మండలాల్లో మైక్రో ఫైనాన్స్ ఆగడాలు పెరిగిపోయాయని బాధితులు చెబుతున్నారు.
Micro Finance | కట్టడిలో విఫలం..
గ్రామాల్లో మైక్రో ఫైనాన్స్లు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నా.. సంబంధిత అధికారులు ముందుగా నిలువరించడంలో విఫలమవుతున్నారు. గతంలో మైక్రో ఫైనాన్స్ల (Microfinance loans) వేధింపులతో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. తిరిగి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకముందే అధికారులు కళ్లు తెరవాల్సి ఉంది. మైక్రో ఫైనాన్స్ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.