అక్షరటుడే, వెబ్డెస్క్: Metro Phase -2 | పాతబస్తీలో మెట్రో పనులకు బ్రేక్ పడింది. మెట్రో విస్తరణలో భాగంగా రెండో దశలో పనులు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ పనులను సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే ఈ పనులతో పలు చారిత్రక కట్టడాలకు ముప్పు ఉందని దాఖలైన పిటిషన్ విచారించిన హైకోర్టు స్టే విధించింది.
మెట్రో నిర్మాణంలో భాగంగా చారిత్రక కట్టడాలను కూల్చివేస్తున్నారంటూ యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ హైకోర్టు(High Court)లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(PIL) దాఖలు చేసింది. దీనిపై విచారించిన న్యాయస్థానం పనులపై స్టే విధించింది. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు ప్రతిపాదించిన మెట్రో మార్గంలో వారసత్వ కట్టడాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. వాటిపై ఎలాంటి ప్రభావం పడుతుందో పర్యవేక్షించే వరకు మెట్రో పనులు చేపట్టొద్దని ఆదేశాలు జారీ చేసింది. మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని, అప్పటివరకు పనులు ఆపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది.
Metro Phase -2 | 7.5 కిలోమీటర్ల మేర..
ప్రస్తుతం పాతబస్తీలో మెట్రో విస్తరణ పనులు చేపడుతున్నారు. రెండో దశలో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మెట్రో కారిడార్(Metro corridor) వేయనున్నారు. దీని కోసం రూ.2,714 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇందులో భాగంగా ఆస్తులు కోల్పోతున్న వారికి ప్రభుత్వం పరిహారం కూడా మంజూరు చేసింది. ఇప్పటి వరకు 205 ఆస్తులకు రూ. 212 కోట్ల పరిహారం చెల్లించారు. అయితే తాజాగా హైకోర్టు స్టే విధించడంతో పనులకు బ్రేక్ పడింది.