అక్షరటుడే, వెబ్డెస్క్: MLC Kavitha | ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె గురువారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu)కు బహిరంగ లేఖ రాశారు. భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉండి ఏపీలో కలిసిన ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలన్నారు. యటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీలను తెలంగాణ(Telangana)లో విలీనం చేయాలని ఆమె కోరారు.
MLC Kavitha | చీకటి ఆర్డినెన్స్ ద్వారా..
రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ముంపు పేరుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను చీకటి ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశారని కవిత ఆరోపించారు. 2014లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న చంద్రబాబు పట్టుబట్టి ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసుకున్నారని ఆరోపించారు. దీంతో లోయర్ సీలేరు పవర్ ప్లాంట్ను లాగేసుకొని తెలంగాణలో కరెంట్ కష్టాలకూ కారకులయ్యారని విమర్శించారు.
MLC Kavitha | రాములోరి ఆలయాన్ని ముంచే ప్రయత్నం
పోలవరం పేరుతో భద్రాచల సీతారామ చంద్రస్వామి ఆలయాన్ని ముంచేసే ప్రయత్నాలు చేస్తున్నారని కవిత ఆరోపించారు. ఏడు మండలాలను ఏకపక్షంగా విలీనం చేసుకోవడంతో భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉన్న, పట్టణాన్ని ఆనుకొని ఉన్న యటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
రాములోరి గుడి మన్యం భూములు పురుషోత్తపట్నం రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్నాయన్నారు. ఆలయం తెలంగాణలో, భూములు ఆంధ్రలో ఉండటంతో కొందరు ఇష్టారాజ్యంగా కబ్జాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాలను అడ్డుకునే ప్రయత్నం చేసిన భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి(Bhadrachalam Temple EO Ramadevi)పై కబ్జాదారులు దాడి చేశారని ఆమె లేఖలో ప్రస్తవించారు. యటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామాలు ఏపీలో ఉండటంతో ఆ గ్రామాల ప్రజలు విద్య, వైద్యం సహా ఇతర సేవలు పొందడానికి వందల కి.మీ.ల దూరం వెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నారు. వెంటనే ఆ గ్రామాలను వెంటనే తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు.