అక్షరటుడే, వెబ్డెస్క్: Cabinet Expansion | రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion) అంశం కొలిక్కి రావడం లేదు. ప్రతిసారి మంత్రివర్గ విస్తరణ చేపడుతారనే సమయానికి పలువురు నిరసన గళం వినిపిస్తున్నారు. దీంతో వారిని బుజ్జగించలేక ప్రతీసారి మంత్రివర్గ విస్తరణ అంశాన్ని హైకమాండ్ వాయిదా వేస్తూ వస్తోంది. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy), పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్(PCC Chief Mahesh Goud) ఢిల్లీలో కాంగ్రెస్ ముఖ్య నేతలతో చర్చించారు. మంత్రివర్గ విస్తరణ, రాష్ట్ర కార్యవర్గ కూర్పుపై వారు కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు.
మంత్రివర్గ విస్తరణకు అంతా లైన్ క్లియర్ అయింది అనుకునే సమయంలో పలువురు ఎమ్మెల్యేలు తమకు మంత్రి పదవి కావాలని డిమాండ్ చేశారు. దీంతో కేబినెట్ విస్తరణ అంశం మళ్లీ మొదటికి వచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) ఎంట్రీ ఇచ్చారు. నాలుగు రోజుల క్రితం రాష్ట్రానికి వచ్చిన ఆమె వరుస సమీక్షలు జరుపుతున్నారు.
Cabinet Expansion | ఎమ్మెల్యేలతో భేటీ
మీనాక్షి నటరాజన్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణ అంశంపై వారితో చర్చించారు. వారి డిమాండ్లు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తెలుసుకున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో సీఎం సహా ప్రస్తుతం 12 మంది ఉన్నారు. మరో ఆరు పదవులు ఖాళీ ఉన్నాయి. వీటిలో సామాజిక సమీకరణాల ప్రకారం నాలుగు పదవులు భర్తీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే ఇటీవల మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయి తమకు మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మీనాక్షి నటరాజన్ను కలిసి విన్నవించారు.
Cabinet Expansion | మీనాక్షిని కలిసిన విజయశాంతి
కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ను ఎమ్మెల్సీ విజయశాంతి (MLC Vijayashanthi) ఆదివారం కలిశారు. ఎన్నికల ముందు ఆమె బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో టికెట్ ఆశించి భంగపడ్డ ఆమెను కాంగ్రెస్ ఇటీవల ఎమ్మెల్సీని చేసింది. ఈ క్రమంలో తనకు బీసీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని ఆమె మీనాక్షి నటరాజన్ను కోరినట్లు తెలిసింది. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. సరైన సమయంలో పదవులు వస్తాయన్నారు. పదవులు ఎవరికి ఇవ్వాలో అధిష్ఠానానికి తెలుసని ఆమె పేర్కొన్నారు. గత కమిటీల్లో తన పేరు లేకపోతే.. మరో కమిటీలో అవకాశం ఉంటుందేమోనని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (MLC Addanki Dayakar) సైతం ఆమెను కలిశారు. కేబినెట్లో అవకాశం కల్పించాలని ఆయన కోరారు. మరోవైపు అందుబాటులో ఉన్న ఎంపీలతో మీనాక్షి సమావేశమయ్యారు. ఈ క్రమంలో కేబినెట్ విస్తరణ అంశం ఈ సారైనా పూర్తయ్యేనా లేదా అని రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు.