అక్షరటుడే, ఇందూరు: Additional Collector Ankit | అతిసార నియంత్రణపై అన్నిశాఖల సమన్వయంతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ అంకిత్ తెలిపారు. ఈ మేరకు జిల్లాస్థాయి టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో చేతుల పరిశుభ్రత, ఓఆర్ఎస్ ద్రావణం (ORS solution) తయారు చేసే విధానంపై కార్యకర్తలకు వివరించాలన్నారు. శుద్ధి చేసిన నీటిని తాగాలని, ప్రతి గ్రామంలోని నీటి ట్యాంకులను క్లోరినేషన్ (Chlorination) చేయాలని సూచించారు. ప్రజల్లో విస్తృతమైన అవగాహన కలిగిస్తూ అతిసార వ్యాధి నియంత్రణపై ముద్రించిన వాల్పోస్టర్లను ప్రదర్శించాలని ఆదేశించారు.
పట్టణ ప్రాంతాల్లో ఉండే మురికివాడల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు. అనంతరం డీఎంహెచ్వో డాక్టర్ రాజశ్రీ (DMHO Rajshri) మాట్లాడుతూ.. అతిసార వ్యాధి నిరోధక అవగాహన కార్యక్రమం జూలై 31వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ఐదేళ్లలోపు పిల్లల్లో అతిసారం వల్ల కలిగే మరణాలను తగ్గించడమే ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఓఆర్ఎస్, జింక్ కార్నర్లను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ అశోక్, డీఆర్డీవో సాయాగౌడ్, డీడబ్ల్యువో రసూల్ బీ, ఆర్డబ్ల్యూఎస్ డిప్యూటీ ఈఈ ధర్మేందర్, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు తదితరులు పాల్గొన్నారు.