అక్షరటుడే, వెబ్డెస్క్ : Jeedimetla | హైదరాబాద్ (Hyderabad) నగరంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్ల నుంచి మొదలు పెడితే బ్యాంకుల వరకు దేనినీ వదలడం లేదు. పలు గ్యాంగ్లు చోరీలతో పోలీసులకు సవాల్ విసురుతున్నాయి. అయితే బ్యాంకులు, ఏటీఎంలలో దొంగతనాల నివారణకు అధికారులు అలారం ఏర్పాట్లు చేస్తారు. దొంగలు వచ్చినప్పుడు అవి మోగుతాయి. దీంతో స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇస్తారు. అయితే ఇక్కడ మాత్రం దొంగలు తమ పని చేసుకొని వెళ్లిపోయాక అలారం మోగింది.
హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల (Jeedimetla) మార్కండేయ నగర్లో మంగళవారం రాత్రి దొంగలు రెచ్చిపోయారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎం (HDFC ATM) సెంటర్లో చొరబడి చోరీ చేశారు. మూడు ఏటీఎంలను గ్యాస్ కట్టర్తో ధ్వంసం చేసి క్యాష్ బాక్స్లను ఎత్తుకెళ్లారు. ముగ్గురు నిందితులు ఈ చోరీకి పాల్పడినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. గంటలోపు ఏటీఎంలను ధ్వంసం చేసి పెద్ద మొత్తంలో నగదుతో పారిపోయారు. అయితే దొంగలు తప్పించుకున్న తర్వాత అలారం మోగడం గమనార్హం.
చోరీపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. అయితే ఎంత మొత్తంలో నగదు పోయిందనే వివరాలు తెలియరాలేదు. బ్యాంక్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు (Police) కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల రావిరాల, మైలార్దేవ్పల్లిలో కూడా ఇలాంటి ATM దొంగతనాలు జరిగాయి. గతంలో నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో సైతం దొంగలు ఏటీఎంలో చోరీ చేశారు.
Jeedimetla | కార్డన్ సెర్చ్ నిర్వహించిన గంటల్లోనే..
బాలానగర్ ఏసీపీ (Bal Nagar ACP) ఆధ్వర్యంలో జీడిమెట్ల పోలీసులు మంగళవారం రాత్రి మార్కండేయ నగర్ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 50 మంది పోలీసీలు ఆ ఏరియాలో తనిఖీలు చేపట్టారు. సంబంధిత పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. అలాగే అనుమానిత వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. అయితే కార్డన్ సెర్చ్ నిర్వహించిన కొద్ది గంటల్లోనే అదే ప్రాంతంలో ఏటీఎం కేంద్రంలో దొంగలు పడడం గమనార్హం. మూడు ఏటీఎంలను ధ్వంసం చేసిన నిందితులులు క్యాష్ బాక్స్లతో పారిపోయారు.