అక్షరటుడే, వెబ్డెస్క్: Minister Seethakka | రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్కను మావోయిస్టులు హెచ్చరించారు. ఆదివాసీలను ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న సీతక్క మౌనంగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు.
ములుగు జిల్లా(Mulugu District)లోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులను పోలీసులు, అటవీ శాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై మంత్రి సీతక్క(Minister Seethakka) మాట్లాడడం లేదని మావోయిస్టులు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన పెసా, 1/70 చట్టాలను మంత్రి సీతక్క మరచిపోయారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆదివాసీల హక్కులకు పూర్తి బాధ్యత మంత్రి సీతక్కదేనని స్పష్టం చేశారు. ఈ మేరకు మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్(Maoist official spokesperson Jagan) పేరిట లేఖ విడుదల చేశారు.
Minister Seethakka | ఆ జీవోను రద్దు చేయాలి
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 49ను మావోయిస్టులు(Maoists) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కుమురం భీమ్ జిల్లా(Kumuram Bheem District)లోని 339 ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించాలని ప్రభుత్వం చూస్తోందని వారు ఆరోపించారు. ఈ జీవోతో రాష్ట్రంలోని కుమురంభీమ్ ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలు కనుమరుగు అవుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. జీవోను వెంటనే రద్దు చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Minister Seethakka | ఆ జీవోలో ఏముంది
ప్రభుత్వం రాష్ట్రంలో టైగర్ జోన్ల ఏర్పాటు కోసం జీవో 49 తీసుకొచ్చింది. పులులు స్వేచ్ఛగా తిరగడానికి టైగర్ జోన్ల(Tiger Zones) పరిధిలోని గ్రామాలను ఖాళీ చేయించడం దీని ఉద్దేశం. ఆయా గ్రామాల వారికి మరో ప్రాంతంలో పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ జీవోను గిరిజనులతో పాటు మావోయిస్టులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ జీవోతో తమ భూములు కోల్పోతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గత కొన్ని రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మావోయిస్టులు లేఖ విడుదల చేయడం గమనార్హం.