అక్షరటుడే, వెబ్డెస్క్: Gujarat High Court | మన దేశంలో న్యాయవ్యవస్థకు, న్యాయస్థానాలకు ఎంతో గౌరవం ఉంటుంది. కోర్టు ఎదుట హాజరైన వ్యక్తులు న్యాయమూర్తుల ఎదుట ఒద్దికగా ఉంటారు. అలాంటి ఓ వ్యక్తి విచారణకు హాజరైన తీరు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. అసలేం జరిగిందంటే..
కరోనా తదనంతర కాలంలో ఆన్లైన్లో కోర్టు విచారణకు (Online court hearing) సర్వసాధారణం అయిపోయాయి. కోర్టు విచారణలు ఆన్లైన్లో జరుగుతుండడంతో లాయర్లు, వాదులు, ప్రతివాదులు ఎక్కడి నుంచైనా హాజరయ్యే అవకాశం కలిగింది. అయితే ఈ స్వేచ్ఛను ఓ వ్యక్తి దుర్వినియోగం చేశాడు. ఏకంగా వాష్రూం నుంచే విచారణకు హాజరయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో అందరినీ షాకింగ్కు గురిచేస్తోంది.
Gujarat High Court | వైరల్గా మారిన వీడియో
గుజరాత్ హైకోర్టు వర్చువల్ ప్రొసీడింగ్స్(Virtual proceedings)కు హాజరైన ఒక వ్యక్తి వాష్రూంలో టాయిలెట్పై కూర్చున్నట్లు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన జూన్ 20న జరిగినట్లు తెలుస్తోంది. జస్టిస్ నిర్జార్ ఎస్ దేశాయ్ ధర్మాసనం ముందు ఓ వ్యక్తి మెడలో బ్లూటూత్ ఇయర్ఫోన్ ధరించి ఉన్న క్లోజప్లో కనిపించాడు. అనంతరం అతను తన ఫోన్ను కాస్త దూరంగా ఉంచాడు. ఇందులో సదరు వ్యక్తి టాయిలెట్పై కూర్చున్నట్లు కనిపించింది. వీడియోలో తాను శుభ్రం చేసుకుని, వాష్రూమ్ నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఆ తర్వాత కొంత సమయం పాటు ఆఫ్ స్ర్కీన్లో ఉండి మళ్లీ ఒక గదిలో కనిపించాడు.
కాగా.. కోర్టు రికార్డుల ప్రకారం.. సదరు వ్యక్తి తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన కేసులో ప్రతివాదిగా హాజరవుతున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇరుపక్షాల మధ్య సామరస్యపూర్వక పరిష్కారం తర్వాత కోర్టు ఎఫ్ఐఆర్ను రద్దు చేసింది.
Gujarat High Court | గతంలో ఒకరికి రూ.50వేల జరిమానా
ఆన్లైన్ కోర్టు కార్యకలాపాల సమయంలో కొందరు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాగే గతంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరైనప్పుడు ఓ న్యాయవాది సిగరెట్ తాగుతూ కనిపించాడు. దీంతో గుజరాత్ హైకోర్టు (Gujarat High Court) అతనికి రూ.50 వేల జరిమానా విధించినట్లు సమాచారం. అంతేకాకుండా ఢిల్లీ కోర్టు వీడియో కాన్ఫరెన్స్లోనూ ఓ కేసులో హాజరైనప్పుడు సిగరెట్ తాగుతూ న్యాయవాది కనిపించడంతో సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.