అక్షరటుడే, వెబ్డెస్క్: Shaktipeeth Expressway | నాగ్పూర్ నుంచి గోవా వరకు రూ.20 వేల కోట్లతో శక్తిపీఠ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి మాహారాష్ట్ర ప్రభుత్వం(Maharashtra Government) పచ్చజెండా ఊపింది. ప్రతిపాదిత నాగ్పూర్-గోవా శక్తిపీఠ్ ఎక్స్ప్రెస్వే(Shaktipeeth Expressway) ప్రాజెక్టు అభివృద్ధి కోసం భూమిని సేకరించడానికి తాజాగా ఆమోదం తెలిపింది. గతంలోనే ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించగా, రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ప్రాజెక్టును నిలిపివేశారు. మరోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రాజెక్టును మళ్లీ తెరపైకి తెచ్చింది. భూ సేకరణకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
Shaktipeeth Expressway | 8 గంటల్లోపే..
తూర్పు మహారాష్ట్రలోని వార్ధా జిల్లా పావ్నార్ నుండి గోవా సరిహద్దుకు సమీపంలో ఉన్న పశ్చిమ మహారాష్ట్ర సింధు దుర్గ్ జిల్లా(Sindhudurg district)లోని పాత్ర దేవి వరకు మొత్తం 802.6 కి.మీటర్ల మేరకు ఈ కొత్త ఎక్స్ప్రెస్వేను నిర్మించనున్నారు. వార్ధా, యావత్మల్, హింగోలి, నాందేడ్, పర్బనీ, బీడ్, లాతూర్, ధరాశివ్, సోలాపూర్, సాంగ్లి, కొల్హాపూర్, సింధుదుర్గ్.. ఇలా 12 జిల్లాల మీదుగా కొంకణ్ ఎక్స్ప్రెస్ వే(Konkan Expressway)తో కలుపుతుంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే ప్రయాణ సమయం గణనీయంగా ఆదా అవుతుంది. నాగ్పూర్ నుంచి గోవాకు వెళ్లడానికి ప్రస్తుతం 18 గంటల సమయం పడుతుండగా, ఎక్స్ప్రెస్ వే అందుబాటులోకి వస్తే అది కేవలం 8 గంటలకు తగ్గిపోతుంది.
Shaktipeeth Expressway | ఆధ్యాత్మిక కేంద్రాలను కలుపుతూ..
మహారాష్ట్రలోని అనేక ముఖ్యమైన ఆధ్యాత్మిక గమ్యస్థానాలను అనుసంధానించడం లక్ష్యంగా ఈ ఎక్స్ప్రెస్ వేను నిర్మిస్తున్నారు. మహోర్, తుల్జాపూర్, కొల్హాపూర్, అంబేజోగై, ఔంధా నాగనాథ్, పర్లి వైజ్నాథ్ (జ్యోతిర్లింగాలు), పండరిపూర్, కరంజా-లాడ్, అక్కల్కోట్, గంగాపూర్, నర్సోబాచి వాడి, ఔదుంబర వంటి ఆధ్యాత్మిక కేంద్రాలను అనుసంధానం చేస్తూ ఈ రోడ్డును నిర్మించనున్నారు.
Shaktipeeth Expressway | 7500 హెక్టార్ల భూ సేకరణ..
ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి అవసరమైన భూ సేకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. 7500 హెక్టార్ల భూమిని సేకరించనున్న ప్రభుత్వం.. ఇందుకోసం ఇప్పటికే హడ్కో నుంచి రూ.12,000 కోట్ల రుణాన్ని పొందింది. ఈ నిధులను ఉపయోగించి భూమిని సేకరించాలని భావిస్తున్నారు. అయితే, భూ సేకరణను వ్యతిరికేస్తూ రైతులు(Farmers) ఆందోళనలు చేపడుతున్నారు. భూమిని సేకరించే విధానంపై చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు. అభ్యంతరాలను సరిగ్గా వినకుండా, ప్రభుత్వం భూసేకరణ నోటీసులు జారీ చేయడం ద్వారా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోందని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి వ్యతిరేకంగా జూన్ 27 సాంగ్లి జిల్లాలోని కవలాపూర్ గ్రామానికి చెందిన రైతులు సిద్ధేశ్వర్ ఆలయం(Siddheshwar Temple) సమీపంలో రాస్తారోకో నిర్వహించాలని నిర్ణయించారు.