అక్షరటుడే, వెబ్డెస్క్: IRCTC Tour Package | వర్షాకాలం వచ్చిందంటే అడవులు పచ్చదనంతో కళకళలాడతాయి. జలపాతాలు తమ హొయలతో కట్టి పడేస్తాయి. చల్లని వాతావరణంలో పచ్చని అడవుల్లో విహరిస్తుంటే ఆ ఆనందమే వేరు. దీంతో ఎంతో మంది ప్రకృతి ప్రేమికులు(Nature lovers) వర్షాకాలంలో టూర్లకు వెళ్తుంటారు. వారి కోసం ఐఆర్సీటీసీ సూపర్ ప్యాకేజీ అందుబాటులోకి తీసుకొచ్చింది.
కర్ణాటకలోని కూర్గ్(Karnataka Coorg) వర్షాకాలంలో చూడదగిన ప్రాంతాల్లో ముఖ్యమైనది. కూర్గ్ అటవీ ప్రాంతంలో పచ్చని చెట్లు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. జలపాతాలు తమ సవ్వడితో పర్యాటకులను(Tourists) కట్టిపడేస్తాయి. కాఫీ తోటలు, చారిత్రక కట్టడాలు కూడా ఇక్కడ ఉంటాయి. కూర్గ్ అందాలను చూడడానికి ‘కాఫీ విత్ కర్ణాటక’ (Coffee with Karnataka) ప్యాకేజీని ఐఆర్సీటీసీ(IRCTC) తీసుకొచ్చింది. ఈ ప్రకృతి అందాలు చూడాలనుకునే వారి కోసం ప్రతి బుధవారం కాచిగూడ నుంచి రైలు ఉంటుంది. జూలై 2 నుంచి ఆగస్టు 27 వరకు ప్రత్యేక రైలు(Special train) అందుబాటులో ఉండనుంది. ఈ టూర్ ప్యాకేజీ ధర రూ.12,670 నుంచి ప్రారంభమవుతుంది. కాచిగూడ, జడ్చర్ల, గద్వాల్, మహబూబ్నగర్, కర్నూలు సిటీ, డోన్ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
IRCTC Tour Package | టూర్ వివరాలు..
ఐఆర్సీటీసీ కాఫీ విత్ కర్ణాటక టూర్ ఆరు రోజులు ఉంటుంది. కాచిగూడ(Kachiguda) నుంచి రైలు బుధవారం రాత్రి 7.05 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం పర్యాటకులు మైసూరు చేరుకుంటారు. అక్కడి నుంచి ఐఆర్సీటీసీ సిబ్బంది పర్యాటకులను కూర్గ్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్తారు. అక్కడ అందమైన అబ్బె జలపాతం, ఓంకారేశ్వర ఆలయాన్ని(Omkareshwara Temple) సందర్శించవచ్చు. మూడో రోజు రాజా సీట్ పార్క్, తలకావేరి, భాగమండల ప్రాంతాలను చూపిస్తారు. నాలుగో రోజు మైసూర్కు తీసుకు వెళ్తారు. టిబెటెన్ మానెస్టరీ, బృందావనం గార్డెన్స్, కావేరి నిసర్గధామ సందర్శించొచ్చు. ఐదో రోజు చాముండి హిల్స్(Chamundi Hills), మైసూర్ ప్యాలెస్(Mysore Palace) చూపిస్తారు. అనంతరం మైసూరు నుంచి కాచిగూడకు ట్రెయిన్ బయలు దేరుతుంది. ఆరో రోజు ఉదయం పర్యాటకులు కాచిగూడ చేరుకుంటారు.
IRCTC Tour Package | ధరల వివరాలు..
కాఫీ విత్ కర్ణాటక టూర్ ప్యాకేజీలో వివిధ రేట్లను ఐఆర్సీటీసీ అందుబాటులో ఉంచింది. థర్డ్ ఏసీ బెర్త్ సింగిల్ షేరింగ్లో రూ.33,160, డబుల్ షేరింగ్కు రూ.18,730, ట్రిపుల్ షేరింగ్ మూమ్ అయితే రూ.14,690 చెల్లించాలి. 5-11 ఏళ్ల చిన్నారులకు విత్ అవుట్ బెడ్కు రూ.9,530, విత్ బెడ్ అయితే రూ.11,140 టికెట్ ధర ఉంటుంది.
స్లీపర్ బెర్త్లో సింగిల్ షేరింగ్లో అయితే రూ.31,140, డబుల్ షేరింగ్కు రూ.16,710, ట్రిపుల్ షేరింగ్లో రూ.12,670గా రేట్లు ఉన్నాయి. 5-11 ఏళ్ల చిన్నారులకు విత్ బెడ్కు రూ.9,120, బెడ్ లేకుండా రూ.7,510 చెల్లించి టూర్కు వెళ్లొచ్చు.
ప్యాకేజీలో భాగంగా కర్ణాటకలో మూడు రాత్రులు ఉండడానికి గదులు, ఉదయం అల్పాహారం ఐఆర్టీసీ ఆధ్వర్యంలోనే ఏర్పాటుచేస్తారు. టోల్, పార్కింగ్ ఛార్జీలు వంటివి ప్యాకేజీలో భాగమే. అయితే మధ్యాహ్నం, రాత్రి భోజనం ప్రయాణికులే చూసుకోవాల్సి ఉంటుంది.