అక్షరటుడే, వెబ్డెస్క్:Subhansh Shukla | అంతరితక్ష ప్రయాణంలో ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తున్నానని భారత వ్యోమగామి శుభాన్ష్ శుక్లా వెల్లడించారు. ఇప్పడిప్పుడే నడవడం నేర్చుకునే చిన్నారిలా జీరో గ్రావిటీ(Zero Gravity)కి అలవాటు పడుతున్నానని చెప్పారు. భారతీయ సంస్కృతిలో భాగమైన హంస బొమ్మను తన వెంట అంతరిక్షంలోకి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా ఆక్సియం-4 మిషన్లోని తన తోటి సిబ్బందితో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు బయల్దేరిన సంగతి తెలిసిందే. వారు ISSతో డాక్ చేయడానికి వెళ్తున్న ఈ సందర్భాన్ని గుర్తుచేసుకోవడానికి స్పేస్ఎక్స్(SpaceX) ఈ ఉదయం డ్రాగన్ లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మన వ్యోమగామి శుభాన్ష్ శుక్లా స్పేస్ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌక నుంచి భారతీయులతో మాట్లాడారు.
Subhansh Shukla | ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తున్నా..
అంతరిక్షంలో జీరో గ్రావిటీకి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నానని శుక్లా తెలిపారు. ‘అందరికీ నమస్కారం.. తోటి వ్యోమగాములతో ఇక్కడ ఉండటం చాలా సంతోషంగా ఉంది. వావ్.. ఇది ఎంత అద్భుతమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో ప్రతిక్షణాన్ని నిజంగా ఆస్వాదిస్తున్నాను. ఇప్పుడిప్పుడే నడక నేర్చుకునే చిన్నారిలా.. జీరో గ్రావిటీకి అలవాటు పడుతున్నాను. ఎలా కదలాలో, నన్ను నేను ఎలా నియంత్రించుకోవా, ఎలా తినాలో తెలుసుకుంటున్నాని’ శుభాన్షు తన అనుభవాలను పంచుకున్నారు. ఈ ప్రయాణం ఎంతో ఉత్సాహంగా, ఉత్కంఠభరితంగా కొనసాగుతోందని చెప్పారు. తన వెంట హంస బొమ్మను తీసుకెళ్తున్నానని చెప్పిన శుక్లా.. భారతీయ సంస్కృతిలో హంస జ్ఞానానికి ప్రతీక అని గుర్తు చేశారు.
Subhansh Shukla | చాలా సేపు నిద్రపోతున్నా..
అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత తనకు అంతగా ఆరోగ్యం బాగోలేదని శుక్లా వివరించారు. తాను చాలాసేపు నిద్రపోతున్నానన్నారు. శిశువులాగా అంతరిక్షంలో నడవడం, తినడం నేర్చుకుంటున్నానని ఆయన వివరించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(International Space Station)లో సమయం గడపడం, తన అనుభవాలను ఇతరులతో పంచుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. భారత వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా రోదసి ప్రయాణం విజయవంతంగా ప్రారంభమైంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వ్యోమగాములను పంపించి అక్కడ పలు ప్రయోగాలు చేయించడానికి అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ ‘యాక్సియం స్పేస్’.. నాసా, స్పేస్ఎక్స్, ఇస్రో, ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్ఏ భాగస్వామ్యంతో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్(Kennedy Space Center)లో బుధవారం మధ్యాహ్నం 12.01 గంటలకు ప్రయోగించిన స్పేస్ఎక్స్కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ నిప్పులు చిమ్ముతూ విజయవంతంగా రోదసిలోకి దూసుకెళ్లింది. యాక్సియం-4 మిషన్లో భాగంగా.. దీర్ఘకాలంపాటు చేపట్టే రోదసి యాత్రల్లో వ్యోమగాముల శారీరక మార్పులపై ప్రధానంగా ఈ మిషన్లో భాగంగా రీసెర్చ్ చేయనున్నారు. రోదసి యాత్రల సమయంలో కండరాలు, గుండె, రక్తనాళాలు, రోగనిరోధక వ్యవస్థపై కలిగే ప్రభావం.. ఇలా 60కి పైగా శాస్త్రీయ ప్రయోగాలను చేయనున్నారు.