అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | జిల్లాలో చేపట్టే రోడ్ల విస్తరణ, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియ (land acquisition process) సజావుగా సాగేలా చూడాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) అధికారులు ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో రోడ్ల విస్తరణ, రైల్వే పనులు, నీటిపారుదల, జాతీయ రహదారులు, పరిశ్రమల స్థాపన తదితర వాటికి అవసరమైన భూ సేకరణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూ సేకరణ పై ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తానని, ఎప్పటికప్పుడు ప్రగతి కనిపించేలా కృషి చేయాలని సూచించారు. బోధన్ – బాసర – భైంసా రోడ్డు నిర్మాణానికి సేకరించిన భూమికి చెల్లింపులు తొందరగా జరిగేలా చూడాలన్నారు. 63వ నంబర్ జాతీయ రహదారి (National Highway No. 63) విస్తరణ, జానకంపేట – బాసర రోడ్డు వెడల్పు, నిజామాబాద్ నర్సి రోడ్డు మార్గంలో అర్సపల్లి వద్ద ఆర్యూబీ నిర్మాణం, మేడ్చల్ నుంచి ముథ్కేడ్ వరకు రైల్వే డబ్లింగ్, సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణం తదితర పనులకు సంబంధించి పలు సూచనలు చేశారు.
భూ సేకరణ ప్రక్రియకు సంబంధించి రైతులతో (Farmers) సంప్రదింపులు జరుపుతూ నష్టపరిహారం నిర్ణయంలో సానుకూల ధోరణిని అవలంభించాలని కలెక్టర్ తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ భూ సేకరణపై పెండింగ్లో ఉన్న అప్పీల్లను వేగంగా పరిష్కరించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, నిజామాబాద్, ఆర్మూర్ ఆర్డీవోలు రాజేంద్ర కుమార్, రాజా గౌడ్, ఎస్సారెస్పీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేందర్, రైల్వే, ఆర్అండ్బీ, జాతీయ రహదారులు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.