అక్షరటుడే, కామారెడ్డి: Village Secretaries | ఉమ్మడి జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల (panchayat secretaries) పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఒకవైపు గ్రామాల్లో పాలకవర్గాలు లేకపోవడం.. మరోవైపు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. గ్రామాల్లో వివిధ పనుల నిర్వహణకు డబ్బులు లేక అప్పులు తెచ్చి చేయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకాధికారులు పట్టించుకోకపోవడంతో భారమంతా తమపైనే పడుతోందని వాపోతున్నారు.
Village Secretaries | ఏడాదిన్నర కాలంగా..
ఉమ్మడి జిల్లాలో వెయ్యికి పైగా గ్రామ పంచాయతీ ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో (Nizamabad district) 545 పంచాయతీలు, కామారెడ్డి జిల్లాలో (Kamareddy district) 537 జీపీలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ పాలక వర్గాల పదవీకాలం పూర్తయి ఏడాదిన్నర అవుతోంది. దీంతో ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. కానీ వారు తమకు కేటాయించిన గ్రామాలవైపు కన్నెత్తి చూడకపోవడంతో పల్లెల్లో పనుల నిర్వహణ భారం అంతా వారిపైనే పడింది.
Village Secretaries | అప్పులు తెచ్చి మెయింటెనెన్స్
గ్రామాల్లో ప్రతి రోజూ ఖర్చులతో కూడుకున్న పనులు ఉంటాయి. రోజువారి కూలి ఇస్తే తప్ప కొందరు పనిచేయలేని పరిస్థితులు ఉంటాయి. అయితే ప్రస్తుతం నిధులు లేక పంచాయతీ కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో ప్రతిరోజు చెత్త సేకరణ చేపట్టడానికి వాడే ట్రాక్టర్కు డీజిల్, మురికి కాల్వల నిర్వహణ, లీకేజీలు, మోటార్ రిపేర్లు, ఇతరాత్ర పనులకు కచ్చితంగా ప్రతిరోజూ డబ్బులు కావాల్సిందే. ఇవన్నీ చేయకపోతే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో చేసేదేమీ లేక పంచాయతీ కార్యదర్శులు (Panchayat secretaries) బయట నుంచి అప్పులు తెచ్చి మరీ పనులు చేయిస్తున్నారు. కొందరు బయట వడ్డీలకు తీసుకువస్తే మరికొందరు ఇంట్లోని బంగారాన్ని తాకట్టు పెట్టి మరీ డబ్బులు తెచ్చి పంచాయతీల మెయింటెనెన్స్ కోసం ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే ఒక్కో పంచాయతీ కార్యదర్శి దాదాపు రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు అప్పులు తెచ్చినట్లు తెలుస్తోంది.
Village Secretaries | నిధుల కోసం వేడుకోలు
గ్రామాల్లో పంచాయతీ పాలక వర్గాలు ఉంటే కేంద్రం నుంచి 15వ ఫైనాన్స్ నిధులు (Finance funds) వచ్చే అవకాశం ఉండేది. ప్రస్తుతం ఏడాదిన్నరగా నిధులు నిలిచిపోయాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వమే నిధులను పంచాయతీలకు సమకూర్చాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని పంచాయతీ కార్యదర్శులు కోరుతున్నారు.
Village Secretaries | నిధులు విడుదల చేయాలి

– మహేశ్ గౌడ్, పంచాయతీ కార్యదర్శుల జిల్లా అధ్యక్షుడు
ఏడాదిన్నరగా గ్రామ పంచాయతీల్లో పాలకవర్గాలు లేవు. పంచాయతీల మెయింటెనెన్స్ ఇబ్బందికరంగా మారింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదు. ఫలితంగా బయట అప్పులు తెచ్చి ఖర్చులు పెడుతున్నాం. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలి.