అక్షరటుడే, వెబ్డెస్క్ : Formula E race case | ఫార్ములా– ఈ కారు రేస్ కేసు (Formula E race case )లో ఏసీబీ(ACB) విచారణను ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తన సెల్ఫోన్లను అధికారులకు అప్పగించలేదు. ఇందుకు ఆయన నిరాకరించారు.
గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా – ఈ రేసులో అవినీతి జరిగిందని ఏసీబీ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించిన కీలక విషయాలు కేటీఆర్ సెల్ఫోన్లు, ల్యాప్టాప్లో ఉన్నాయని ఏసీబీ భావిస్తోంది. ఈ క్రమంలో వాటిని తమకు బుధవారం లోగా అప్పగించాలని ఏసీబీ ఆదేశించింది. అయితే కేటీఆర్ మాత్రం గడువులోగా వాటిని అప్పగించలేదు. ఇదే సమయంలో ఆయన ఏసీబీకి లేఖ రాశారు.
ఏసీబీ (ACB) నోటీసుల మేరకు తాను విచారణకు హాజరైనట్లు కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. 2021 నవంబర్ 1 నుంచి 2023 డిసెంబర్ 1వ తేదీ వరకు ఆయన ఉపయోగించిన మొబైల్ ఫోన్ను కోర్టుకు సమర్పించాలని ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసు అందిన సమయం నుంచి పరికరంలో ఎటువంటి సమాచారాన్ని తొలగించవద్దని పేర్కొంది. తన వద్ద ఉన్న మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, ట్యాబ్, ఐప్యాడ్ వంటి ఏదైనా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాన్ని కూడా సమర్పించాలని ఏసీబీ ఆదేశించిందని కేటీఆర్ పేర్కొన్నారు.
Formula E race case | అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన
ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన అన్ని వివరాలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ (MAUD) శాఖ వద్ద ఉన్నట్లు కేటీఆర్ లేఖలో తెలిపారు. అయితే తన ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు సమర్పించాలనడం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని కేటీఆర్ పేర్కొన్నారు. అది ప్రాథమిక హక్కులను (Fundamental rights) ఉల్లంఘించడేమనని అన్నారు. దర్యాప్తు కోసం ఎలక్ట్రానిక్ పరికరాలు అవసరమని నిర్ధారణకు రావడానికి ఎటువంటి ఆధారం లేదని ఆయన లేఖలో తెలిపారు.
గతంలో ఓ కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) కూడా నిందితులుగా ఉన్న వ్యక్తుల ఫోన్లలోని కంటెంట్ను యాక్సెస్ చేయవద్దని ఆదేశించినట్లు ఆయన గుర్తు చేశారు. అంతేగాకుండా 2024లో తాను కొత్త ఫోన్ కొనుగోలు చేసినట్లు తెలిపారు. పాత ఫోన్ తన వద్ద లేదన్నారు. అలాగే తాను ఏ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించలేదని లేఖలో పేర్కొన్నారు. అయితే కేటీఆర్ లేఖపై ఏసీబీ ఎలా స్పందిస్తుందో చూడాలి.