అక్షరటుడే, వెబ్డెస్క్:Kommineni Srinivas Rao | అమరావతి (Amaravati capital city) మహిళలపై అనుచిత వ్యాఖ్యల డిబేట్ కేసులో అరెస్టయి ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చారు కొమ్మినేని శ్రీనివాసరావు. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆయనకు బెయిల్ మంజూరైంది.
ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని, వాటిని ప్రోత్సహించేలా ప్రవర్తించవద్దని, భవిష్యత్లో జాగ్రత్తగా ఉండాలని న్యాయమూర్తులు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం కొమ్మినేనిని(Kommineni Srinivas Rao) హెచ్చరించారు. అయితే ఇటీవల తాను ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల్లో తనకు అండగా నిలిచిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన భార్య వైఎస్ భారతిరెడ్డికి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు (కేఎస్ఆర్) KSR హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తాను నిర్దోషిగా బయటపడడానికి వారి చొరవే కారణమని, వారు అందించిన సహకారం వల్లే తాను మళ్లీ ప్రజల ముందుకు రాగలిగానంటూ ఎమోషనల్ అవుతూ మాట్లాడారు.
Kommineni Srinivas Rao | వారే లేకపోతే..
“అరెస్ట్కు వెళ్తానని అనుకోలేదు. అన్నింటికీ మానసికంగా సిద్ధపడాలని అనుకున్నా. నాకు తెలిసి నేను ఎప్పుడూ కూడా ఎవరినీ కించపరచలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని(Chandra Babu Naidu) కూడా ఎవరైనా గారు అనకపోతే నేను ఊరుకోను. అలాంటి నాపైన, నా వ్యక్తిత్వం, విశ్వసనీయత, నా ఇంటిగ్రిటీని దెబ్బతీసేందుకు కుట్ర జరగడం నాకు ఆవేదన కలిగించింది. ఈ జీవిత, వృత్తి చరమాంకంలో ఇలా జరగడం బాధ కలిగిస్తోంది. నాకు ఇప్పుడు 70 ఏళ్లు. ఇంకెంత కాలం బతుకుతా.. ఎంతకాలం పనిచేస్తా..?, నా 50 ఏళ్ల జర్నలిజం కెరీర్లో ఎప్పుడూ రాని మచ్చతో జీవితాన్ని చాలించాల్సి వస్తుందేమోనని బాధపడ్డాను. అరెస్టులకు భయపడి కాదు, నా వ్యక్తిత్వం, విశ్వసనీయత దెబ్బతీసేలా కుట్ర జరగడం నన్ను చాలా ఆవేదనకు గురిచేసింది” అని గద్గద స్వరంతో కొమ్మినేని మాట్లాడారు.
కొందరు తన ఊపిరి తీయాలని చూస్తే జగన్ (YS Jagan), భారతి తనకు ఊపిరి పోసి పునర్జన్మనిచ్చారని కొమ్మినేని భావోద్వేగంగా అన్నారు. “వారికి నా శతకోటి దండాలు. ఊపిరి తీయడం సులభం, కానీ ఊపిరి పోయడం కష్టం. అలాంటిది వారు నాకు మళ్లీ ఈ అవకాశం కల్పించారు” అని తెలిపారు. తాను జైల్లో ఉన్న సమయంలో కూడా ‘కేఎస్ఆర్ లైవ్ షో’ను అదే బ్రాండ్తో కొనసాగించడం తన పట్ల వారికి ఉన్న గౌరవాభిమానాలను తెలుపుతోందని, వారికి ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదని అన్నారు. “నా గురించి బాగా తెలిసిన వారు కూడా అభ్యంతరకరంగా వార్తలు రాయడం ఆశ్చర్యం కలిగించింది. విమర్శించడం తప్పుకాదు. కానీ లేనివి, అబద్ధాలు సృష్టించకూడదు. మీడియా పవిత్రంగా ఉండాలి” అని ఆయన హితవు పలికారు.