అక్షరటుడే, వెబ్డెస్క్: IND vs ENG | ఇంగ్లాండ్ తో జరుగుతున్న లీడ్స్ టెస్ట్లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేయడంతో భారీ స్కోరు దిశగా సాగుతోంది. యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) సెంచరీ, శుభ్మన్ గిల్(Shubhman Gill) సెంచరీతో అజేయంగా నిలవడంతో జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ ఒక అరుదైన రికార్డును నెలకొల్పాడు. అయితే సాధారణంగా టెస్టు క్రికెట్లో లంచ్ బ్రేక్, టీ బ్రేక్, ఇన్నింగ్స్ ఎండింగ్ ఓవర్లో ఎక్కడ ఔట్ అవుతాం అనే భయంతో చాలా జాగ్రత్తగా ఆడతారు. ఇంగ్లండ్-ఇండియా మధ్య నిన్న జరిగిన మ్యాచ్లో కూడా లంచ్ బ్రేక్కి ముందు సాయి సుదర్శన్ వికెట్ కోల్పోయాడు. దాంతో మిగతా వారు చాలా జాగ్రత్తగా ఆడారు. అయితే రిషబ్ పంత్ తీరుకి కేఎల్ రాహుల్ రెండు చేతులెత్తి దండం పెట్టాడు.
IND vs ENG | స్టన్ అయ్యాడు..
ఇంగ్లండ్ – ఇండియా టెస్టు తొలి రోజు ఆట ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్లోకి వస్తున్న పంత్కు (Rishabh Pant) రాహుల్ దండం పెట్టాడు. అవుట్ కాకుండా ఎలాగోలా ఈ రోజు ముగించావన్నట్టు కేఎల్(KL Rahul) ఎక్స్ప్రెషన్ ఉంది. క్రిస్ వోక్స్ వేసిన తొలి రోజు ఆఖరి ఓవర్లో రిషబ్ పంత్ మొదటి బంతినే ముందుకొచ్చి సిక్సర్ బాదాడు. దాంతో ఇంగ్లండ్ బౌలర్లతో పాటు టీమిండియా ప్లేయర్లు కూడా స్టన్నయ్యారు. ఆఖరి ఓవర్ ముగిసి బేల్స్ తొలగించేంత వరకూ టీమిండియాలో ఒకటే టెన్షన్. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఎక్కడ వికెట్ పడుతుందోనని టెన్షన్ పడ్డాడు. రెండో బంతి డాట్ కాగా.. మూడో బంతికి పంత్ రెండు పరుగులు తీశాడు. ఆఖరి మూడు బంతులు వోక్స్ చాలా చాకచక్యంగా బౌలింగ్ చేశాడు. చివరి బంతి అయితే ఇన్ స్వింగ్ అయ్యి వికెట్లకి పైగా వెళ్లిపోయింది. ఆ ఓవర్లో వికెట్ పడకపోవడంతో అందరూ హ్యాపీగా ఫీలయ్యారు.
ఐపీఎల్ 2025 సీజన్ మొత్తం నిరాశపరిచిన తర్వాత రిషబ్ పంత్ ఇంగ్లాండ్లో మొదటి టెస్ట్ మొదటి రోజునే మెరిశాడు. రిషబ్ పంత్ 65 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. మొదటి రోజు రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. రిషబ్ పంత్ ఒక పెద్ద ఘనతను సాధించాడు. 27 ఏళ్ల రిషబ్ పంత్ లీడ్స్లో మొదటి రోజు తన టెస్ట్ కెరీర్లో 3000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో 3000 టెస్ట్ పరుగులు పూర్తి చేసిన రెండో అత్యంత వేగవంతమైన వికెట్ కీపర్గా నిలిచాడు. రిషబ్ పంత్ 76 ఇన్నింగ్స్లలో ఈ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ గిల్క్రిస్ట్ (Adam Gilchrist) మాత్రమే 63 ఇన్నింగ్స్లతో రిషబ్ పంత్ కంటే ముందు ఉన్నాడు.