అక్షరటుడే, వెబ్డెస్క్: Encounter : వరుస ఎదురుదెబ్బలతో చెల్లాచెదురవుతున్న మావోయిస్టులకు మరో షాక్ తగిలింది. మారేడుమిల్లి అడవు(Maredumilli forests)ల్లో బుధవారం తెల్లవారు జామున భారీ ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్(Uday), జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ(Aruna) హతమయ్యారు.
భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా, మావోయిస్టుల తారసపడడంతో కాల్పులు మొదలయ్యాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం జరిగింది. సెంట్రల్ కమిటీ సభ్యుడు ఉదయ్, జోనల్ కమిటీ సభ్యురాలు అరుణతో మరొకరు మృతి చెందారు. భద్రతా బలగాల భారీ కాల్పుల నేపథ్యంలో కొందరు మావోలు పరారయ్యారు. వారి కోసం మారేడుమిల్లి అడవుల్లో గ్రేహౌండ్స్ బలగాల కుంబింగ్ కొనసాగుతోంది.
Encounter : నేలకొరుగుతున్న కీలక నేతలు
గతంలో ఎన్నడూ లేని రీతిలో మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆపరేషన్ కగార్(Operation Kagar) ప్రారంభమైనప్పటి నుంచి కీలక నేతలంతా నేలకొరుగుతున్నారు. ఏకంగా కేంద్ర కమిటీ కార్యదర్శి సైతం పోలీసు కాల్పుల్లో బలవడంతో దళాలు నిరాశలో కూరుకుపోయాయి. రోజురోజుకు భద్రతా బలగాలు పైచేయి సాధిస్తుండడం, దండకారణ్యంలోకి చొచ్చుకెళ్తుండడంతో మావోలకు ఊపిరి సలపడం లేదు. వరుస ఎన్కౌంటర్లలో కీలక నేతలు హతమవుతుండడంతో పార్టీలో నాయకత్వ సంక్షోభం ఏర్పడింది.
ఇప్పటికే మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. 21 ఏళ్ల క్రితం పార్టీ ఆవిర్భావం సమయంలో 42 మంది ఉండేవారు. ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో ఆ సంఖ్య తగ్గింది. ఈ ఏడాది జనవరి నుంచే ఎన్కౌంటర్లలో నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు మృతి చెందారు.
10 రోజుల క్రితం బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన నర్సింహాచలం అలియాస్ సుధాకర్(Narasimhachalam alias Sudhakar)తో కలిపి ఈ ఏడాది ఇప్పటి వరకూ నలుగురు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు(Nambala Kesava Rao) కూడా ఉన్నారు.
కేంద్ర కమిటీ సభ్యులు రామచంద్రారెడ్డి అలియాస్ జయరాం, అలియాస్ చలపతి, పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న వేర్వేరు ఎన్కౌంటర్లలో హతమయ్యారు. ఇక మిగిలింది 16 మంది మాత్రమే. వారిని వేటాడేందుకు భద్రతా బలగాలు దండకారాణ్యాన్ని జల్లెడ పడుతున్నాయి.