అక్షరటుడే, వెబ్డెస్క్: Kedarnath Temple | ఉత్తరాఖండ్లోని ప్రధాన శైవక్షేత్రం కేదార్నాథ్ ఆలయం(Kedarnath Temple) శుక్రవారం తెరుచుకుంది. హిమాలయాల్లో కొలువుదీరిన ఈ ఆలయాన్ని తొలిరోజు 12,000 మందికి పైగా యాత్రికులు దర్శించుకున్నారు. నేపాల్, థాయిలాండ్, శ్రీలంక వంటి వివిధ దేశాల నుంచి తీసుకువచ్చిన గులాబీలు సహా 54 రకాల 108 క్వింటాళ్ల పూలతో అలంకరించారు. 11,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ఆలయ ద్వారాలు ఉదయం 7 గంటలకు తెరిచినట్లు బద్రీనాథ్-కేదార్నాథ్(Badrinath-Kedarnath) ఆలయ కమిటీ అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి(CM Pushkar Singh Dhami) ప్రారంభోత్సవానికి హాజరయ్యారు, స్వామివారిని దర్వించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రావల్ (ప్రధాన పూజారి) భీమశంకర్ లింగ్, పూజారి బాగేష్ లింగ్, కేదార్నాథ్ ఎమ్మెల్యే ఆశా నౌటియల్, మత పెద్దలు, వేద పండితులు తూర్పు ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లి, గర్భగుడి ద్వార పూజలో పాల్గొన్నారు.
Kedarnath Temple | 4న తెరుచుకోనున్న బద్రీనాథ్
చార్ ధామ్లోని నాలుగు దేవాలయాలలో కేదార్నాథ్ కూడా ఒకటి. 11వ జ్యోతిర్లింగం అయిన కేదార్నాథ్ భక్తులను అమితంగా ఆకర్షిస్తుంది. శీతాకాల విరామం తర్వాత తెరవబడే చార్ ధామ్ యాత్రలో ఇది మూడో ఆలయం. గంగోత్రి (Gangotri), యమునోత్రి(Yamunotri) ఆలయాలు ఏప్రిల్ 30న తెరుచుకోగా, బద్రీనాథ్ మే 4న తెరుచుకోనుంది. కేదార్నాథ్ ద్వారాలను తెరిచే ప్రక్రియ ఉదయం 5 గంటలకు ప్రారంభమైందని బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ మీడియా ఇన్చార్జ్ హరీష్ గౌర్ తెలిపారు. ప్రతి సంవత్సరం దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు సందర్శించే ఈ ఆలయం శీతాకాలంలో మూసివేయబడుతుంది.
Kedarnath Temple | తొలిసారిగా మహా హారతి..
కేదార్నాథ్(Kedarnath)లో ఈసారి ప్రత్యేకంగా మహా హారతి నిర్వహించనున్నారు. వారణాసి, హరిద్వార్, రిషికేశ్లలో ఇస్తున్న గంగా ఆరతి మాదిరిగానే ఆలయం సమీపంలోని మందాకిని, సరస్వతి నదుల సంగమం వద్ద మహా హారతి ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి భక్తుల కోసం ప్రత్యేకంగా ర్యాంపులు ఏర్పాటు చేశారు.