అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: PCC Chief Mahesh Goud | ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు జైలుకు వెళ్లడం ఖాయమని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Goud) అన్నారు. నగరంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభాకర్ రావుని అడ్డం పెట్టుకొని బడా నేతలు, సినీ తారలు, జడ్జీల ఫోన్లను ట్యాపింగ్ చేసిందన్నారు. ఇది నీచమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరిని ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు. దీనికి కారకులైన అందరూ జైలుకు వెళ్లాల్సిందేనని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబం (KCR Family)తో పాటు, ఫోన్ ట్యాపింగ్లో కీలకంగా వ్యవహరించిన అధికారులను జైలుకు పంపుతామన్నారు.
PCC Chief Mahesh Goud | పేదల అభ్యున్నతే లక్ష్యం
పేద ప్రజల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) పని చేస్తోందని మహేశ్ గౌడ్ అన్నారు. రైతు భరోసా (Rythu Bharosa) కింద నిన్నటి వరకు సుమారు రూ.7 వేల కోట్లు రైతు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. గోదావరి జలాల (Godavari Water) విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. మన రాష్ట్రానికి 968 టీఎంసీల వాటా రావాల్సి ఉండగా అప్పటి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. నాటి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో కేసీఆర్ చెట్టాపట్టాల్ వేసుకొని తెలంగాణకు అన్యాయం చేశారని ఆరోపించారు. గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు.
PCC Chief Mahesh Goud | కాళేశ్వరంతో ప్రయోజనం లేదు
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)తో రైతులకు నయాపైస ఉపయోగం లేదని ఆయన అన్నారు. ఇప్పటివరకు 100 టీఎంసీలు కూడా ఎత్తిపోయలేదని విమర్శించారు. కాళేశ్వరం కాంట్రాక్టుల జేబులు నింపడానికి, కేసీఆర్ కుటుంబానికి ప్రయోజనాన్ని చేకూర్చడానికి మాత్రమే పని చేసిందన్నారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ప్రభుత్వ ఉన్నతాధికారుల సమన్వయంతో నిజామాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మహేశ్ గౌడ్ హామీ ఇచ్చారు.
ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కేసీఆర్ కూతురు కవిత ఎంపీగా ఉన్న సమయంలో కూడా నిజామాబాద్ అభివృద్ధికి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. నిజామాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తమ ప్రభుత్వం రాజకీయం కంటే అభివృద్ధిపైనే దృష్టి సారించిందని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో మానాల మోహన్ రెడ్డి, కేశ వేణు, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.