అక్షరటుడే, కామారెడ్డి: మద్యం విక్రయాలకు గ్రామాలు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాయి. పట్టణాల్లో కంటే గ్రామాల్లో ఎప్పుడు పడితే అప్పుడు మద్యం అందుబాటులో ఉంటుంది. గ్రామాల్లో బెల్టు షాపులు పెట్టడానికి గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో టెండర్లు వేస్తున్న నేటి తరుణంలో శుక్రవారం మూడు గ్రామాలు మద్య నిషేధం విధిస్తూ తీర్మానం చేయడమే కాకుండా కఠినమైన శిక్షలు ఖరారు చేశారు.
రాజంపేట (Rajampet) మండలంలోని గుండారం (Gundaram), ఎల్లాపూర్ తండా (Yellapur Thanda), నడిమి తండా (Nadimi thanda) ప్రజలు గుండారం గ్రామంలోని ఎల్లమ్మ ఆలయం వద్ద సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్థులంతా మద్యం విక్రయాలు, మద్యం సేవించడం నిషేధిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశాయి. అంతేకాకుండా తీర్మానాన్ని ఉల్లంఘించి మద్యం విక్రయాలు జరిపితే రూ. లక్ష జరిమానా, ఏడు చెప్పు దెబ్బలు అంటూ తీర్మానం చేశాయి. అదే సమయంలో మద్యం విక్రయించిన వారి వివరాలు వెల్లడించిన వారికి రూ.20వేల బహుమతి ప్రకటించారు. గ్రామాల సరిహద్దుల్లో ఎవరు మద్యం తాగినా శిక్షలు వర్తిస్తాయని పేర్కొన్నారు.