అక్షరటుడే, కామారెడ్డి/ఎల్లారెడ్డి : సహజీవనం చేస్తున్న ప్రియుడి కోసం తన కుమారుడిని విక్రయించిందో మహిళ. తర్వాత ప్రియుడు తన భార్య దగ్గరకు వెళ్లడంతో అత్తింటి వారి దగ్గర ఆస్తిలో వాటా కోసం మళ్లీ బిడ్డను ఇప్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది. సీడీపీవో స్రవంతి తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన బూస లావణ్యకు నర్సింలు అనే వ్యక్తితో పెళ్లయింది. వీరికి ఐదేళ్ల బాబు, నాలుగేళ్ల పాప ఉన్నారు. అనారోగ్యం నర్సింలు మృతి చెందగా.. లావణ్య బట్టల షాపులో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. లింగంపేట మండలం పర్మల్ల గ్రామానికి చెందిన సాయిలుతో లావణ్యకు పరిచయం అయింది. దీంతో ఇద్దరు కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు.
Kamareddy | ఆటో కోసం..
సాయిలు ఉపాధి కోసం ఆటో కొనివ్వడానికి తన కుమారుడు నిఖిల్ను లావణ్య విక్రయించింది. పర్మల్ల గ్రామానికి చెందిన దూదేకుల నసీమాకు రూ.50 వేలకు కుమారుడిని అమ్మేసి, ప్రియుడికి ఆటో కొనిచ్చింది. అయితే సాయిలుకు ఇదివరకే పెళ్లయిందని లావణ్యకు తెలియడం, సాయిలు భార్య వచ్చి గొడవ చేయడంతో లావణ్య మళ్లీ ఒంటరి అయింది. అయితే తన అత్తింట్లో భర్త తరఫున ఆస్తిలో వాటా తీసుకోవాలని భావించింది. అయితే కుమారుడు ఉంటేనే ఆస్తిలో వాటా ఇస్తారని బిడ్డ కోసం లావణ్య పర్మళ్ల గ్రామానికి వెళ్లింది. అయితే అప్పటికే నసీమా బాబును మెదక్ జిల్లా రాజీపేటకు చెందిన తన సోదరి షాహిదాకు విక్రయించింది. షాహిదా ఆ బాబును అదే గ్రామానికి చెందిన కుంచాల శేఖర్కు రూ.లక్షకు అమ్మేసింది. ఈ క్రమంలో లావణ్య తనబిడ్డను తనకు ఇవ్వడం లేదని ఈ నెల 4 న పోలీసులకు ఫిర్యాదు చేయగా చైల్డ్ వెల్ఫేర్ అధికారులు, పోలీసులు బాబును తీసుకువచ్చి బాల సంరక్షణ అధికారులకు అప్పగించారు. బాబు తల్లి లావణ్య, సాయిలు, నసీమా, షాహిదా, శేఖర్లపై కేసు నమోదు చేశారు.