అక్షరటుడే, వెబ్డెస్క్ :Eatala Rajendar | కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project)పై బీజేపీ నేత, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కాళేశ్వరం ఓ అద్భుతమైన వరమని ఆయన పేర్కొన్నారు. ఓ టీవీ ఛానెల్తో మాట్లాడుతూ.. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఈటల మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్తో ఎండాకాలంలో తెలంగాణ(Telangana)లో చెరువులు మత్తడి దూకాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్తో వాగులు పారాయని, చెరువులు నిండాయని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్తో పాటు చెక్డ్యాములు కట్టడంతో నేడు తెలంగాణలో భూగర్భ జలాలు పెరిగాయని అన్నారు. ఈ ప్రాజెక్ట్తో ఎస్సారెస్పీ ఆయకట్టు 14.8 లక్షల ఎకరాలకు నీరు అందిందని పేర్కొన్నారు. ఎండాకాలంలో కూడా మహబూబ్ నగర్ లాంటి ప్రాంతంలో కూడా నీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయంటే కాళేశ్వరమే కారణం అన్నారు.
కాళేశ్వరం ఎత్తిపోతలతో వచ్చే కరెంట్ బిల్లు సంగతి పక్కన పెడితే.. ఈ ప్రాజెక్ట్తో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. కాంగ్రెస్ వచ్చాక రైతులు (Farmers) మళ్లీ ఏడుస్తున్నారని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం వివాదం చేయకుండా వాడుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో నచ్చిన వారికి కాంట్రాక్ట్లు ఇచ్చారో లేదో తనకు తెలియదన్నారు.
Eatala Rajendar | రాజకీయ వర్గాల్లో చర్చ
కాళేశ్వరం ప్రాజెక్ట్పై ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. కాళేశ్వరం నిర్మాణ సమయంలో ఈటల ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. బీఆర్ఎస్(BRS) రెండోసారి అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ ఆయనను పక్కన పెట్టింది. మంత్రి పదవి నుంచి తొలగించింది. దీంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అనంతరం హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచారు. అప్పటి నుంచి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్న ఆయన తాజాగా కాళేశ్వరం అద్భుతమని పొగడటం గమనార్హం.
బీజేపీ నాయకులు కాళేశ్వరంతో ఉపయోగం లేదని, ఇందులో భారీగా అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఈటల రాజేందర్ ఆ ప్రాజెక్ట్తో రైతులకు మేలు అని వ్యాఖ్యానించడం గమనార్హం. మేడిగడ్డ(Medigadda) కుంగుబాటు, కాళేశ్వరంలో అక్రమాలు నిగ్గు తేల్చేందుకు కాంగ్రెస్ కాళేశ్వరం కమిషన్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిషన్ ఎదుట జూన్ 5న ఈటల రాజేందర్ విచారణకు హాజరయ్యారు. మంత్రివర్గంలో చర్చించాకే పనులు చేపట్టామని ఆయన కమిషన్కు వివరించారు. బ్యారేజి నిర్మాణం మేడిగడ్డకు మార్చడంపై స్పందిస్తూ.. సాంకేతిక అంశాలు తమకు తెలియదని, అధికారుల సూచన మేరకు చేపట్టామన్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్తో తెలంగాణకు ఎంతో మేలు అని వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.