అక్షరటుడే, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(62)(Jubilee Hills MLA Maganti Gopinath) ఆదివారం (జూన్ 8) తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న గోపీనాథ్ గచ్చిబౌలి(Gachibowli)లోని ఏఐజీ ఆస్పత్రి(AIG Hospital)లో ఈ రోజు ఉదయం 5.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.
గత గురువారం సాయంత్రం (ఈ నెల 5న) తీవ్రమైన ఛాతీనొప్పి నొప్పిరావడంతో గోపీనాథ్ ను అతని కుటుంబ సభ్యులు వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి హాస్పిటల్లోనే చికిత్స పొందుతూ ఉన్నారు. ఈయనకు కార్డియాక్ అరెస్టు అయింది. సీపీఆర్(CPR)తో తిరిగి గుండె కొట్టుకోవడంతోపాటు నాడి సాధారణ స్థితికి వచ్చినా.. అపస్మారక స్థితి నుంచి ఆయన తేరుకోలేదు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి ఆదివారం ఉదయం కన్నుమూశారు.
మాగంటి గోపీనాథ్ జూన్ 2, 1963న జన్మించారు. గోపీనాథ్ 2014, 2018, 2023 శాసనసభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్((Jubilee Hills) నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలుపొందారు. 1985 నుంచి 1992 వరకు ఆయన తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు.
2014 ఎన్నికల్లో మాగంటి టీడీపీ(TDP) తరఫున బరిలోకి దిగారు. తన సమీప మజ్లిస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్పై 9 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో తొలిసారికే విజయం అందుకున్నారు. ఆ తర్వాత భారాసలో చేరి, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్రెడ్డిపై గెలుపొందారు. గత ఎన్నికల్లో(2023)నూ జూబ్లీహిల్స్ నుంచే పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్పై గెలిచి, హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యారు.
మాగంటి గోపీనాథ్ మరణంపై భారాస(BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పార్టీకి తీరనిలోటని పేర్కొన్నారు. ఆయనకు సంతాపం, గోపీనాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(Telangana CM Revanth Reddy) కూడా మాగంటి గోపీనాథ్ మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తపర్చారు. ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. మాగంటి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.